ఈడీ ఎదుట హీరో రవితేజ: మనీలాండరింగ్- ఫెమా యాక్ట్ ఉల్లంఘన: డ్రైవర్ కీలకంగా..!!
టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో మరో హీరో ఈ రోజున ఈడీ ముందు హాజరయ్యారు. గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణ ఎదుర్కొన్న హీరో రవితేజ ఇప్పుడు ఈడీ అధికారుల నోటీసులు అందుకున్నారు. PMLA కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు జారీ చేసారు. దీంతో.. రవితేజ తో పాటుగా ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ ముందు హాజరయ్యారు. కెల్విన్ నుంచి రవితేజ డ్రైవర్ శ్రీనివాస్కు డ్రగ్స్ సరఫరా అయినట్లు ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.
మనీ లాండరింగ్-ఫెమా ఉల్లంఘనలపై
ఎఫ్క్లబ్తో ఉన్న పరిచయాలు, విదేశీ టూర్లు, కెల్విన్తో ఉన్న సంబంధాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ను విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పూరి జగన్నాథ్, చార్మీ, రకుల్,నందు, రానాలను ఈడీ అధికారులు విచారించింది. అయితే నందు, రానాలను డ్రగ్ అప్రూవర్ కెల్విన్ సమక్షంలో ఈడీ విచారణ చేసింది. దీంతో నేడు మరోసారి కెల్విన్ హాజరు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
కీలకంగా మారిన రవితేజ డ్రైవర్
ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖులను ప్రధానంగా వారి బ్యాంకు లావాదేవీలతో పాటుగా కెల్విన్ తో ఉన్న సంబంధాల పైన ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. కెల్విన్ లాప్ టాప్ లో ఉన్న సమాచారం పూర్తి సేకరిస్తున్న ఈడీ అధికారులు దాని ఆధారంగా విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే, సినీ ప్రముఖులు తమకు కెల్విన్ తో ఉన్న సంబంధాల పైన ఇచ్చే సమాధానం ఆధారంగా వారి తదుపరి విచారణ ఆధార పడి ఉంటుందని చెబుతున్నారు. కొందరి బ్యాంకు ఖాతాల నుంచి కెల్విన్ తో పాటుగా ఇతర డ్రగ్స్ సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.
బ్యాంకు లావాదేవీలు..పార్టీలకు హాజరు పై ఆరా
దీంతో..ప్రతీ ఒక్కరి బ్యాంకు లావాదేవీలు..వాటికి సంబంధించిన ఆధారాలు ఈ విచారణలో కీలకం అవుతున్నాయి. హీరో దగ్గుబాటి రాణా విషయంలోనూ ఈడీ ఇవే అంశాల పైన ఫోకస్ చేసింది. రానా, కెల్విన్ను కలిపి అధికారులు ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రానాను ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్ సరఫరా దారుడు కెల్విన్తో సంబంధాలు.. ఎఫ్ క్లబ్లో పార్టీలు.. అక్కడ పార్టీలు జరుపుకొనే తీరు.. ఎవరెవరు పార్టీలకు హాజరయ్యేవారు..కెల్విన్కు ఎప్పుడైనా డబ్బులు పంపారా అంటూ..ఇలా రానాపై ఈడీ అధికారులు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసారని తెలుస్తోంది.
కెల్విన్ ఫోన్ లో హీరోల నెంబర్లు
అయితే, కీలక నిందితుడైన కెల్విన్ మాస్కెరాన్స్తో ఆర్థిక లావాదేవీలపై రానాను పదే పదే ప్రశ్నించగా అతడోవరో తనకు తెలియదని రానా సమాధానం చెప్పినట్లుగా తెలిసింది. కెల్విన్ సెల్ఫోన్లో ఉన్న పలువురి ఫోన్ నంబర్లు, వారితో జరిపిన వాట్సప్ చాటింగ్ను అధికారులు పరిశీలించారు. సెప్టెంబర్ 13న నవదీప్, ఎఫ్క్లబ్ పబ్ జనరల్ మేనేజర్, 17న తనీష్, 22న తరుణ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఈడీ వారికి నోటీసులు జారీ చేసింది.
రవితేజ నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం
ఇక, రవితేజ కేసులో డ్రైవర్ శ్రీనివాస్ కీలకంగా చెబుతున్నారు. ఆయన నుంచి ఈడీ మరింత కీలక సమాచారం రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యహారంలో రాజకీయంగానూ ఆరోపణలు..విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ - బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక, ఈడీ విచారణ సమయంలో సేకరించే సమాచారం ఆధారంగా తదుపరి కార్యాచరణ ఖరారయ్యే అవకాశం ఉంది.