సినీ హీరోలు సంపాదనే కాదు - ఇచ్చి తీరాలి: మంత్రి జయరాం..!!
Kurnool Garjana: రాయలసీమ జేఏసీ నిర్వహించిన కర్నూలు గర్జన సక్సెస్ అయింది. వైసీపీ మంత్రులు..నేతలు ఈ గర్జనలో పాల్గొని మద్దతు ప్రకటించారు. కర్నూలు జిల్లా మంత్రి జయరాం గర్జన సభలో కీలక వ్యాఖ్యలు చేసారు. రాయలసీమ ఇప్పటికే చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా రాజధాని రాకపోతే భవిష్యత్ ఆందోళనగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా జగన్ రాయలసీమకు రాజధాని ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో సినీ పరిశ్రమకు - కర్నూలుకు ఉన్న సంబంధాలను వివరిస్తూ మంత్రి జయరాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు సీమ గడ్డపైన పుట్టి రాయలసీమకు రాజధాని వస్తే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. ఒకే రాజధాని కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగు సినీ పరిశ్రమ తమ సినిమాల్లో కర్నూలు ప్రస్తావన చేస్తోందని..వేల కోట్లు హీరోలు సంపాదించుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. సీమ బిడ్డగా వారందరినీ తాను ఒకటే అడుగుతున్నానని చెబుతూ.. ప్రతీ హీరో కర్నూలు న్యాయ రాజధానిగా మద్దతివ్వాలని..ఇచ్చి తీరాలని కోరారు. చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదని ఆయన ధ్వజమెత్తారు.
మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం వైయస్ జగన్ ముందుకెళ్తున్నారని చెప్పారు. ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతివ్వాలని కోరారు. సినీ పరిశ్రమకు, కర్నూలుకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అందుకే కర్నూలులో హైకోర్టుకు సినీ పరిశ్రమ మద్దతును ఇవ్వాలని కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలని మంత్రి జయరాం కోరారు.