అనంతపురంలో అసెంబ్లీ పెట్టండి: కర్నూలు లో అలా: వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్..!
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన ఇప్పుడు అధికార పార్టీలోనూ భిన్న స్వరాలకు కారణమవుతోంది. శానసభలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన..జీఎన్ రావు కమిటి సిఫార్సుల పైన అమరావతి ప్రాంతంలో రైతులు..స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో..ప్రభుత్వం ప్రస్తుతానికి రాజధాని పైన అధికారిక నిర్ణయం వాయిదా వేసింది. హైలెవల్ కమిటితో పాటుగా అసెంబ్లీలో చర్చించి..తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది. ఇదే సమయంలో రాయలసీమ ప్రాంతం నుండి డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కర్నూలు లో హైకోర్టు ప్రతిపాదనతో హర్షం వ్యక్తం చేసిన ఆ ప్రాంత పార్టీల నేతలు..ఇప్పుడు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నారు.
అనంతలో అసెంబ్లీ పెట్టాలి..
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడంలో భాగంగా అనంతపురం జిల్లాలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని కదిరి వైసీపీ ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. అమరావతిలో లక్ష కోట్లు పెట్టి రాజధాని అభివృద్ధి చేసే కంటే 3 రాజధానులు ఏర్పాటు చేస్తే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతపురంలో అసెంబ్లీ ఏర్పాటు చేసి, శీతాకాల సమావేశాలు నిర్వహిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
దీంతో పాటు వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు కూడా ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో హైకోర్టుతో పాటుగా మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వేంకటేష్ డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంతానికి చెందిన మేధావులు..రాజకీయ నేతలు నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాసారు.

సీమలో పెరుగుతున్న రాజధాని డిమాండ్
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన చర్చ మొదలైన సమయం నుండి రాయలసీమ ప్రాంత నేతలు బలంగా తమ వాదన వినిపిస్తున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమయంలోనే ఆ ప్రాంతానికి చెందిన విద్యార్ధులు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేసారు. తమ ప్రాంతంలోనే హైకోర్టు..రాజధాని ఏర్పాటు చేయాలని నినదించారు.
మాజీ మంత్రి మైసూరా రెడ్డి లాంటి వారు సైతం హైకోర్టు బెంచ్ లు రెండు ఏర్పాటు చేసి..కర్నూలులో హైకోర్టు అని చెప్పినా ఉపయోగం లేదని వాదిస్తున్నారు. అయితే, రాజధాని తరలింపు..కొత్తగా హైపవర్ కమిటీ ఏర్పాటు తో ఆ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా అసెంబ్లీ లో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ సమయంలో సభలో ఎమ్మెల్యేలు ఏ రకమైన అభ్యర్ధనలు ప్రభుత్వం ముందు ఉంచుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications