రాయపాటి దేవుడు, పవన్ కళ్యాణ్తో మాట్లాడ్తా: డొక్కా
గుంటూరు: గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావుతో పాటు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. రాయపాటి తనకు దేవుడు అని, అయితే రాయపాటితో పాటు తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై సందిగ్ధంలో ఉన్నానని ఆయన శనివారం మీడియాతో చెప్పారు.
తన రాజకీయ జీవితానికి రాయపాటి కారకుడని, రాయపాటి తనను తమ్ముడిలా చూసుకున్నారని ఆయన చెప్పారు. తన మానసిక స్థితిపై, తన మీమాంసపై రాయపాటికి వివరిస్తానని ఆయన చెప్పారు. కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో మాట్లాడి పార్టీ మారే విషయంపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. కాంగ్రెసు నుంచి బహిష్కరణకు గురి కావడంతో రాయపాటి తన భవిష్యత్తు రాజకీయంపై నిర్ణంయ తీసుకున్నారని ఆయన చెప్పారు.
రాయపాటికి తనకూ మధ్య విడదీయలేని సంబంధం ఉందని, రాయపాటితో మాట్లాడిన తర్వాత ఏ విషయమూ చెబుతానని ఆయన అన్నారు. రాజకీయాల్లో తనకు ఓ హోదా రావడానికి రాయపాటి కారణమని ఆయన అన్నారు. తనకు గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చిన కాంగ్రెసు పార్టీని వీడే విషయంపై తాను సందిగ్ధంలో ఉన్నానని ఆయన చెప్పారు. అయితే, రేపటి బస్సు యాత్రలో మాత్రం తాను పాల్గొంటానని ఆయన చెప్పారు.
తనను పిలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తాను మాట్లాడుతానని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అయితే, పవన్ కళ్యాణ్తో రాజకీయాల గురించి మాట్లాడబోనని, సామాజిక విషయాల గురించి మాట్లాడుతానని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పే విషయాలు కాంగ్రెసు పార్టీలోనే అమలు అవుతాయని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై తాను సంశయంలో పడిపోయానని ఆయన అన్నారు. తాడికొండ నుంచి మాత్రం పోటీ చేయబోనని ఆయన అన్నారు. రాయపాటి సాంబశివ రావుతో పాటు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశంలో చేరుతారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.