అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన.. ఏడుగురు మృతి, చంద్రబాబు తీవ్రదిగ్భ్రాంతి!
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్ లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి .ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. భోజన సమయంలో జరగటంతో చాలామంది భోజన విరామంలో ఉన్నారు.
ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం .. ఐదుగురు మృతి
అచ్యుతాపురం సెజ్ లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన 50 మందిని అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతింది. భారీగా మంటలు చెల్లరేగి మంటల్లో అక్కడ పని చేసే కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇప్పటివరకు ఐదుగురు అగ్నికి ఆహుతి అయ్యారు.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ప్రస్తుతం ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రుల హాహాకారాలు, మృతుల కుటుంబాల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. పేలుడు జరిగిన ఫార్మా కంపెనీలో 300 మంది కార్మికులు పని చేస్తున్నారు.
కలెక్టర్ తో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశం
ఇక అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ప్రమాద ఘటనపైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హుటాహుటిన కలెక్టర్ తో మాట్లాడిన చంద్రబాబు క్షతగాత్రులకు అందుతున్న వైద్యం పైన కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాల కోసం తక్షణ సహాయ చర్యలు చేపట్టవలసిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
అగ్నిప్రమాద ఘటనపై మాట్లాడిన కార్మిక శాఖా మంత్రి
ఇక ఈ ప్రమాద ఘటన పైన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. ఈ అగ్నిప్రమాదకటన దురదృష్టకరమైన ఘటన అని ఆయన పేర్కొన్నారు . ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని, సంఘటన స్థలంలోనే కలెక్టర్, ఎస్పీలు ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
ఎంత మంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేం అన్న మంత్రి
అయితే ఈ ప్రమాదంలో ఇంకా ఎంతమంది చనిపోయారు అన్నది పూర్తిగా తెలియడానికి కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. రియాక్టర్ పేలుడు ఘటన వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని పేర్కొన్న ఆయన కార్మిక శాఖ అధికార యంత్రాంగం కూడా అక్కడే ఉండి తక్షణ సహాయ చర్యలు చేపడుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications