తెర వెనుక పెద్ద కథే: పవన్ అభిమానిని సామాజిక వర్గ పోరే బలితీసుకుందా?
అమరావతి: అభిమాని హత్య ఘటన నేపథ్యంలో జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో శనివారం నిర్వహిస్తున్న బహిరంగ సభపై రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. అభిమానులకు భరోసా ఇవ్వడం కోసమే ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నా దీనికి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉందని విశ్లేషకులంటున్నారు.
అభిమాని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలోని కోలార్లో పవన్ అభిమాని వినోద్ రాయల్ హత్యకు దారి తీసిన పరిస్థితులపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఇది ఫ్యాన్స్ మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నప్పటికీ, తెర వెనుక పెద్ద కథే ఉందని అంటున్నారు. సామాజిక వర్గ పోరే ఈ హత్యకు ప్రేరేపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్య గొడవ యాధృచ్ఛికంగా మొదలై ఆవేశపూరితంగా సద్దుమణిగిపోతుంది.
కానీ వినోద్ రాయల్ది పకడ్బందీగా జరిగిన హత్య కావడంతో అనుమానించాల్సి వస్తోందని అంటున్నారు. కోలారు ప్రాంతంలో రెండు సామాజిక వర్గాల మధ్య చాలా కాలంగా వర్గపోరు కొనసాగుతోందని, వినోద్ రాయల్ పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వ్యతిరేక వర్గానికి ఇష్టం లేక ఈ దారుణానికి ఒడిగట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కోలారుకు సమీపంలోని నరసాపూర్ నందిని డాబా దగ్గర ఈ నెల 21న రాత్రి గొడవ పడ్డ త్రినాథ్, సునీల్ వేరే వ్యక్తితో వినోద్ రాయల్ను హత్య చేయించినట్లు ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. వినోద్ రాయల్ హత్య ఘటనలో ప్రధాన నిందితులైన త్రినాథ్, సునీల్లను కోలారు రూరల్ పోలీసులు విడిచి పెట్టడాన్ని వినోద్ తల్లిదండ్రులు పవన్ దగ్గర ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్తానని పవన్ మీడియా ముఖంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల సభల్లో విస్తృతంగా పాల్గొన్న టీడీపీ నేతలెవరూ ఈ ఘటనపై మాట్లాడకపోవడం వెనుక ఓ సామాజికి వర్గాన్ని బలపరుస్తున్నారనే కొత్త కోణంలో మీడియాలో ఊపందుకుంది.
ఈ హత్య ఘటనలో నిందితులుగా ఉన్న త్రినాథ్, సునీల్లు కోలారులో ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కేసు నీరుగారే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. వినోద్ రాయల్ హత్య నేపథ్యంలో మూడు రోజులపాటు తిరుపతిలో బసచేసిన పవన్ ఈరోజు సాయంత్రం నిర్వహించే సభలో ఏం మాట్లాడనున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.