జగన్ కు కొరకరాని కొయ్యలుగా మారింది వీరే... సమయం చూసి ఒక్కొక్కరూ షాక్ లు... !
ఏపీలో రాజ్యాంగ సంస్ధల అధిపతులుగా ఉన్న కొందరు అధికారులు, నేతలు సీఎం జగన్ కు కొరకరాని కొయ్యలుగా మారిపోతున్నారు. గతంలో చాలా ప్రభుత్వాల్లో అధినేతలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నా ఈసారి జగన్ మాత్రం వారందరికంటే ఎక్కువగా వీరి విషయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే వీరిని తొలగించే విషయంలో మాత్రం నిబంధనలు అంగీకరించకపోవడంతో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో అభిసంశన, రాజ్యాంగ సంస్ధల రద్దు వంటి తీవ్ర నిర్ణయాలకు సైతం సిద్ధమవుతున్నట్లుగా అర్దమవుతోంది.
టీడీపీ అధికారంలో ఉండగా...
ఏపీలో 2014లో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత కీలకమైన రాజ్యాంగ సంస్ధల అధిపతులుగా తమకు అనుకూలమైన కొందరు అధికారులను, రాజకీయ నేతలను నియమించింది. వీరిలో కొందరు అప్పటి సీఎం చంద్రబాబు ఎంపికలు కాగా, మరికొందరు సీనియార్టీ, ఇతర కారణాలతో ఆ పదవులు వరించిన వారు ఉన్నారు. అయితే వీరి విషయంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్లు కనిపించలేదు. ఉన్నా వాటిని ఎప్పుడూ చంద్రబాబు బయటపెట్టేవారు కాదు. కానీ విపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం చంద్రబాబు తన సామాజిక వర్గం వారినే ఎంచుకుంటున్నారని ఆరోపణలు చేసేది.
వైసీపీ రాకతో మారిన పరిస్ధితి ..
2019లో వైసీపీ అధికారం చేపట్టాక గతంలో తాము ఎవరిపైన అయితే ఆరోపణలు చేసిందో వారిని ఒక్కొక్కరిగా తొలగించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ బదిలీ కాగా, ఇంటెలిజన్స్ ఛీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ కూడా దక్కలేదు. అయితే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని తొలగించేందుకు లేదా బదిలీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిబంధనలు అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. అయితే సరిగ్గా ఇదే కారణం వారికి కూడా కలిసివచ్చింది. జగన్ సర్కారు తమను ఏమీ చేయలేదనే అంచనాకు వచ్చిన సదరు అధికారులు, నేతలు తమ పని తాము స్వేచ్ఛగా చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో వారి నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను జగన్ సర్కారు జీర్ణించుకోలేని స్ధితికి చేరుకుంటోంది.
ఏపీపీఎస్సీ, మండలి, వక్ఫ్ బోర్డ్, ఎన్నికలసంఘం..
వివిధ కారణాలతో ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జలీల్ ఖాన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలి జగన్ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అయితే వీరిని ప్రస్తుతం వారు ఉన్న పదవుల నుంచి తప్పించే వీలు లేదు. దీంతో వారిని తప్పించేందుకు ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తూనే అవసరమైతే వ్యవస్ధల రద్దుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతోంది. సెలక్ట్ కమిటీకి రాజధాని బిల్లులు పంపిందన్న కారణంతో శాసన మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం ఇందులో భాగమే. అయితే మండలిని రద్దు చేసినంత సులువుగా మిగతా వ్యవస్దలను రద్దు చేయడం మాత్రం సాధ్యం కాదు.
పదవులు ఉన్నంతవరకూ ఆగాల్సిందే..
శాసనమండలి రద్దు ప్రతిపాదనల వ్యవహారాన్ని పక్కనబెడితే ఏపీపీఎస్సీ, వక్ఫ్ బోర్డు, ఎన్నికల కమిషనర్ వంటి సంస్ధల విషయంలో ఆయా సంస్ధలకు నేతృత్వం వహిస్తున్న వారి విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్ధితి. తమకు ఇష్టమున్నా లేకున్నా వారి పదవీకాలం ముగిసేవరకూ సీఎం జగన్ వారిని భరించాల్సిందే. అలా కాదని ప్రతీ వ్యవస్ధ రద్దుకో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి అభిశంసనకో సిద్ధమైతే సాధారణ జనంలో ప్రభుత్వంపై సైతం తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది. తమకు నచ్చని వారి నల్లా తప్పించుకుంటూ వెళతారా అన్న విమర్శలు ఇప్పటికే విపక్షాల నుంచి వినిపిస్తుండగా.. రేపు సాధారణ జనం కూడా ఇదే ప్రశ్న వేస్తారనేది అతిశయోక్తి కాదు.