రఘురామ అరెస్ట్ ఇష్యూ: కొత్త గండం: చిలికి చిలికి గాలివానగా: ఏపీ డీజీపీ, హోం శాఖకూ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది జగన్ సర్కార్ నోటీసులు అందుకునే దాకా వెళ్లింది. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు, సుప్రీంకోర్టుల్లో ఎదురుదెబ్బలు తిన్న ప్రభుత్వం.. రఘరామ అరెస్ట్ వ్యవహారంలో మరో సంజాయిషీని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రఘురామ అరెస్ట్ అంశంపై తాజాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది.
ఏపీ ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులపై నిర్దేశిత గడువులోగా సమాధానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును ఎన్హెచ్ఆర్సీ తప్పు పట్టింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
కస్టడీలో రఘురామపై పోలీసుల దాడి చేయడానికి ప్రయత్నించడంపై సంతృప్తికర కారణాలను వివరించాలని సూచించింది. దీనిపై అంతర్గత విచారణ చేపట్టాలని పేర్కొంది. ఓ సిట్టింగ్ ఎంపీని అదుపులోకి తీసుకోవాల్సిన సమయంలో పోలీసులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు తమకు ఫిర్యాదు అందిందని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. గుండెనొప్పితో బాధపడుతోన్న ఎంపీ ఆ రకంగా పోలీసులు అరెస్టు చేసి ఉండకూడదని అభిప్రాయపడింది.
రఘురామను అదుపులోకి తీసుకున్న ఈ నెల 14వ తేదీ నాడు రాత్రంతా ఆయనపై భౌతికంగా దాడి చేశారని ఫిర్యాదిదారుడు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపింది. లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోకుండానే ఎంపీని అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేసింది. ఆయన శరీరంపై గాయాల గుర్తులు ఉండటం వల్లే న్యాయస్థానం వైద్య పరీక్షలకు ఆదేశించిందని పేర్కొంది. వాటన్నింటిపైనా తమకు నాలుగు వారాల్లోగా సమాధాన ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.