ఎర్రచందనం స్మగ్లింగ్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అరెస్ట్
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, కర్నూలు జిల్లా ఎంపీపీ మస్తాన్ వలీని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గతంలో రుద్రవరం వద్ద ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న మస్తాన్ వలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్టు కింద అరెస్టై, బెయిల్ పైన విడుదలైన అతను మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు.
ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కొనసాగుతున్న గాలింపు
కడప జిల్లాలోని శేషాచలం, పెనుశిల నరసింహస్వామి అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. అడవుల్లో మరికొందరు స్మగ్లర్లు ఉన్నారనే అనుమానంతో సాయుధ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు వచ్చిన కొందరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఎన్కౌంటర్ ఘటనతోనూ ఎర్ర దొంగలు వెనక్కు తగ్గినట్టు కనిపించడం లేదు. అడవుల్లోకి చొరబడి ఎర్రచందనం దుంగలను యథేచ్ఛగా వాహనాల్లో తరలిస్తున్నారు. శని, ఆదివారాల్లో కడప, నెల్లూరు జిల్లాల్లో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు 134 మంది ఎర్ర దొంగలు పట్టుబడ్డారు. వీరి నుంచి 2 కోట్లకుపైగా విలువైన ఎర్రచందనం దుంగలు, వాహనాలు, సెల్ఫోన్లు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి శేషాచలం అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మృతి చెందగా, మిగిలినవారు తప్పించుకున్నారు. వారిని పట్టుకోవడానికి 400 మంది పోలీసులను అడవుల్లోకి దించారు. మరోవైపు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పోలీసులూ ఎర్రదొంగల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు, రాపూరు, కడప జిల్లా రాజంపేటల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శేషాచలం ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ
శేషాచలం ఎన్కౌంటర్ పైన మానవ హక్కుల సంఘం స్పందించింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారుల పేర్లు చెప్పాలని, దీనిపై జూడిషియల్ విచారణ జరిపించాలని చెప్పింది. సంఘటన స్థలంలో దొరికిన డైరీలు, ఇతర ఆయుధాలు భద్రపరచాలని చెప్పింది. అనంతరం విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. ఎన్హెచ్ఆర్సీ ముందు సాక్షులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications