గంగిరెడ్డి పెళ్లికొడుకాయెనే..!: మారిషస్ మహిళతో పెళ్లికి సన్నాహాలు
హైదరాబాద్: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని ఏపీ పోలీసులు ఇక మన రాష్ట్రానికి తీసుకురాలేరేమో? ఎందుకంటే ప్రస్తుతం మారిషస్ జైల్లో ఉన్న గంగిరెడ్డి పోలీసుల ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాడు. అంతేకాదు మారిషస్ పౌరసత్వం పొందే దిశగా అడుగులు వేస్తున్నాడు.
ఇందుకోసం అతడు పెళ్లికొడుకు అవతారం ఎత్తనున్నాడు. మారిషస్కు చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు గంగిరెడ్డి సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. మారిషస్కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా గంగిరెడ్డికి ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది.
ఇదే గనుక జరిగితే తమ దేశ పౌరసత్వం ఉన్న వ్యక్తిని మారిషస్ డిపోర్టేషన్ (ఇతర దేశాల అభ్యర్థన మేరకు తమ దేశం నుంచి బహిష్కరించడం) చేయదు. ఏపీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మారిషస్ మహిళతో పెళ్లి ఒక్కటే మార్గమన్న అక్కడి న్యాయవాదుల సలహాతో గంగిరెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే గంగిరెడ్డి సోదరుడితో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు కూడా మారిషస్ వెళ్లి అతడిని కలిసి వచ్చారు. ఇందుకు అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్ సాహుల్ భాయ్ సహకారం తీసుకున్నారు.
అనారోగ్య కారణంతో ఇటీవలే జైల్లో ఉన్న గంగిరెడ్డిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో వారిని కలిసిన ఏపీ పోలీసులు కూపీ లాగడంతో ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి పెళ్లి సన్నాహాలను తెలుసుకున్నారు.
గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ను మారిషస్ కోర్టు ఇప్పటికే మూడు సార్లు తిరస్కరించింది. కాగా, గంగిరెడ్డి అప్పగింతకు అవసరమైన ఒప్పంద పత్రాలను భారత ప్రభుత్వం మారిషస్కు అందజేసింది. మోస్ట్ వాంటెడ్ గంగిరెడ్డిని తమకు అప్పగించాలని భారత్ మారిషస్ను కోరింది.
గంగిరెడ్డిని పోలీసులు మారిషస్లో ఫిబ్రవరి చివరి వారంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్యకు కుట్ర పన్నిన కేసులో కూడా గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్తో గంగరెడ్డి అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు ఈడీ గుర్తించింది.
దేశవిదేశాల్లో స్మగ్లర్ గంగిరెడ్డికి ఉన్న ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ ఈడీకి అందజేసింది. అతని ఆస్తులు జఫ్తు చేసేందుకు ఈడీ సిద్ధమైన విషయం తెలిసిందే.