పాలన పబ్ జీ గేమ్ కాదు.. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు..జగన్ కు చంద్రబాబు హితవు
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు .జగన్ విధానాలు, పాలన గురించి పబ్ జీ గేమ్ ఆటలా అభివర్ణించారు. సీఎం జగన్ ఏపీలో పరిపాలన అంటే పబ్ జీ గేమ్ లా అనుకుంటున్నారని, అందుకే విధ్వంసం చేస్తూ పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . సీఎం జగన్ కు రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడటం పద్ధతి కాదని చంద్రబాబు విమర్శించారు.
మీరు పాలన చేతకాకపోతే కనీసం తెలుసుకోవాలని , నిపుణులు, మేధావులు పరిపాలన దక్షత తెలిసిన వారి నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలని జగన్ కు సలహా ఇచ్చారు. 5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు.. తుగ్లక్ జగన్ ఒక వైపని చంద్రబాబు విమర్శించారు .
50వ రోజు రాజధాని అమరావతి రైతులకు సంఘీభావంగా చంద్రబాబు
ఇక వైసీపీ సర్కార్ తప్పు చేస్తుంది అని తెలిసినా వైసీపీ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని దద్దమ్మలని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ తప్పు అని చెప్పిన నేతలు విశాఖలో పేదల అసైన్డ్ భూములు కొట్టేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 50 రోజులుగా రాజధాని అమరావతి కోసం దీక్షలు చేస్తున్న రాజధాని రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ సీఎం చంద్రబాబు సీఎం జగన్ ఇప్పటికైనా మారాలని హితవు పలికారు.
ప్రతీకార రాజకీయాలు తగవు అంటూ జగన్ కు సూచించిన చంద్రబాబు
రాజధాని మార్పు, పోలవరం రివర్స్ టెండరింగ్ లో జగన్ వ్యవహరిస్తున్న తీరు పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ప్రతీకారంతో వీటిన్నింటిని జగన్ మార్చేస్తున్నారని, ప్రతీకార రాజకీయాలు తగవు అంటూ జగన్ కు చంద్రబాబు సూచించారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏసుప్రభువుపై నమ్మకం ఉంటే ఇక్కడే అమరావతిని కొనసాగిస్తానని చెప్పాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. పాలన పబ్ జీ గేమ్ కాదని ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చంద్రబాబు హితవు పలికారు.
రాజధాని కోసం 39 మంది రైతులు చనిపోయారని ఆవేదన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు రాజధాని కోసం 39 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి డబ్బుల్లేవని జగన్ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతిలో నిర్మాణానికి లేని నిధులు ఇతర ప్రాంతాల్లో ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. అమరావతిని శ్మశానం అన్నారని, శ్మశానంలో కూర్చొని పాలించారా? అని నిలదీశారు చంద్రబాబు . రాజధానికి వరదలు వస్తాయని వైసీపీ నేతలు ప్రచారం చేశారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ప్రభుత్వం అంటే నమ్మకమని, అసత్యాలు చెప్పొద్దన్న చంద్రబాబు
ఇక విభజన తర్వాత ఏపీ అభివృద్ధికి తాను చాలా కష్టపడ్డానని చెప్పిన చంద్రబాబు ఏపీకి పెట్టుబడిదారులను తీసుకు రావడం వారితో ప్లాంట్లను పెట్టించడానికి తాను చాలా కష్టపడ్డానని చెప్పారు. కేంద్రమంత్రులను పారిశ్రామిక వేత్తలను బతిమిలాడానని బాబు ఆవేదన చెందారు.తాను కూడా జగన్ లా వ్యవహరిస్తే అంతర్జాతీయ, జాతీయ కంపెనీలన్నీ ఏపీ నుంచి పారిపోయేవని అన్నారు.
ప్రభుత్వం అంటే నమ్మకమని, అసత్యాలు చెప్పొద్దని చంద్రబాబు అన్నారు.
రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల్ని సీఎం వద్దకు తీసుకెళ్ళారు
రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల్ని సీఎం వద్దకు తీసుకెళ్లి.. సంఘీభావం తెలుపుతున్నారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. చట్టాలను ఉల్లంఘించేది ప్రభుత్వమే కాదని చంద్రబాబు అన్నారు. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఉండాలని.. అమరావతిని ప్రారంభించడం తప్పా? అని ప్రశ్నించారు. 2015లో జీవో జారీ చేసి అమరావతిపై నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు అదే విషయాన్ని నిన్న కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు .
దేశమంతా మారుతున్నారు కానీ మన తుగ్లక్ మారడంలేదని ఎద్దేవా
దేశమంతా మారుతున్నారు కానీ మన తుగ్లక్ మారడంలేదని ఎద్దేవా చేశారు. పిచ్చి నవ్వు నవ్వుతూ ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని మార్చొద్దని అసెంబ్లీలో చేతులెత్తి వేడుకున్నానని.. జగన్ మాత్రం వెకిలినవ్వు నవ్వారని చంద్రబాబు విమర్శించారు. రాజధానిని నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుందని కేంద్రం చెప్పింది కానీ రాజధానిని మార్చడానికి హక్కు ఉందనలేదని కేంద్రం చేసిన ప్రకటనపై చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి 3 రాజధానులు పెట్టుకోమని కేంద్రం చెప్పలేదన్నారు.