సలసల కాగుతున్న ఏపీ: అక్కడ 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత
ఏపీలో ఎండ తీవ్రత అధికమైంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఈ నెల చివరి వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది.
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తోన్నాయి. మరింత ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. వేడి గాలుల ప్రభావానికి శరీరంలో నీటి శాతం కూడా ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఉక్కపోత ఊపిరిసలపనివ్వట్లేదు.

పలు జిల్లాలను తీవ్ర వేడిగాలులు చుట్టుముట్టాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ వాతావరణం మరో మూడు రోజుల పాటు కొనసాగవచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడల్లో 47.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీలు చొప్పున, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.6, పోలవరం జిల్లా కూనవరంలో 46.5, నెల్లూరు జిల్లా కావలిలో 46.4, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, నెల్లూరు జిల్లాల వ్యాప్తంగా 43 నుండి 45 డిగ్రీల సెల్సియస్ వరకు పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దాదాపుగా అన్ని పట్టణాల్లో కూడా 40 నుండి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ కాసింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా 15 తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎండ తీవ్రత కొనసాగనున్న నేపధ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.












Click it and Unblock the Notifications