డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు-ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు-సీబీఐ అప్పగింతపై...
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో గతేడాది తీవ్ర సంచలనం రేపిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్న ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారిస్తే తమకు న్యాయం జరగదని, సీబీఐకి అప్పగించాలంటూ తల్లితండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ తీర్పు వెలువరించింది.
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు పై నమోదు చేసిన కేసు విచారణ నత్తనడకన సాగుతుండటం, పోలీసులు ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును వారు కోరారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇందుకు నిరాకరించింది. సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టును 15రోజుల్లో తెప్పించుకోవాలని దర్యాప్తు అధికారికి ఆదేశాలు ఇచ్చింది. దానిని పరిశీలించి వ్యక్తులను గుర్తించి.. హత్య విషయంలో పాత్ర ను నిర్ధారిచాలని ఆదేశాలు ఇచ్చింది.

సీబీఐకి బదులుగా ఏపీ పోలీసులే విచారణ చేసేలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తులో గుర్తించిన అంశాలతో అదనపు అభియోగపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే మూడు నెలల్లో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఆదేశించింది. దీంతో ఏపీ పోలీసులే దీనిపై దర్యాప్తు చేయనున్నారు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా తానే సుబ్రహ్మణ్యాన్ని పలు కారణాలతో హత్య చేసినట్లు ఇప్పటికే పోలీసుల ఎదుట అంగీకరించారు. అయినా పోలీసులు మాత్రం ఛార్జిషీట్ దాఖలు చేయకుండా ఆలస్యం చేస్తుండంపై విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications