వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా - అదే బాటలో మరో నేత : టీడీపీకి ఉచ్చు..!!
వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా ప్రకటించారు. విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నేతలు కీలక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు విశాఖ పరిపాలనా రాజధాని కోసం తాను రాజీనామాకు సిద్దమని..ఉద్యమంలోకి రావాలని ఉందని వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలకు ముందుకొచ్చారు. అమరావతి రైతుల వెనుక టీడీపీ ఉందని..చంద్రబాబును ఉత్తరాంధ్రలో ఇరుకున పెట్టే వ్యూహం వైసీపీ నేతలు అమలు చేస్తున్నారు.
ధర్మాన రాజీనామా లేఖ- డిమాండ్
అందులో భాగంగా.. తాజాగా విశాఖ కేంద్రంగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు అయింది. ఈ వేదికగా వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేసారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తూ ఆ లేఖను జేఏసీ కన్వీనర్ కు అందించారు. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే ముమ్మాటికీ అమరావతికి తాము వ్యతిరేకమేనని ధర్మశ్రీ వెల్లడించారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా తాను రాజీనామాకు సిద్దమంటూ జేఏసీ నేతలకు వెల్లడించారు. విశాఖ - ఉత్తరాంధ్ర భవిష్యత్ కోసం ఏ నిర్ణయానికైనా సిద్దమని ప్రకటించారు.
విశాఖలో పరిపాలనా రాజధానికి అనుకూలంగా తాను చోడవరంటో పోటీ చేసేందుకు సిద్దమని ధర్మశ్రీ వెల్లడించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను వ్యతిరేకిస్తూ టెక్కలిలో అచ్చన్నాయుడు పోటీకి సిద్ధం అవ్వాలని ధర్మశ్రీ డిమాండ్ చేసారు.
టీడీపీని ఇరుకున పెట్టే వైసీపీ వ్యూహం
కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచి వెలివేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో పరిపాలనా రాజధాని - ఉత్తరాంధ్ర ప్రజల్లోకి మరింతగా చొచ్చుకొని వెళ్లేలా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇటు ఉత్తరాంధ్ర - అటు రాయలసీమలో రాజధానులకు టీడీపీ వ్యతిరేకమే అభిప్రాయంతో రాజకీయంగా బలహీన పరిచేందుకు వ్యూహాలు సిద్దం చేస్తోంది. టీడీపీ మాత్రం మౌనంగానే పరిణామాలను గమనిస్తోంది.
అమరావతిని కాదని టీడీపీ ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఉత్తరాంధ్రలో వైసీపీ దూకుడు రాజకీయాలతో ఆ ప్రాంతంలోని టీడీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో వైసీపీ నేతల పైన సానుకూలత ఏర్పడుతుందా అనే చర్చ మొదలైంది. అదే జరిగితే రాజకీయంగా నష్టం తప్పదనే వాదన ఉంది.
టీడీపీ ట్రాప్ అవుతుందా.. వాట్ నెక్స్ట్
ఇప్పటి వరకు అమరావతి రాజధాని అంటూ మద్దతు చెప్పిన టీడీపీ నేతలను ఆత్మరక్షనలోకి నెట్టేలా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. ఒక విధంగా వైసీపీ నేతల ప్రకటనలు - నిర్ణయాలతో టీడీపీ నేతలు మౌనంగా ఉండటమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్రలో అమరావతి పాదయాత్ర ప్రవేశించనుంది.
ఇప్పటి వరకు పాదయాత్రకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలుకుతూ కనిపించారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీ తీరుతో టీడీపీ నేతలు అక్కడ ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇదంతా టీడీపీని ట్రాప్ చేసేందుకు వైసీపీ పక్కా వ్యూహంతో ఉచ్చు బిగుస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు విశాఖ కేంద్రంగా చోటు చేసుకుంటున్న రాజకీయం ఉత్కంఠను పెంచుతోంది.