ఏపీలో ఫలితాలు ఆలస్యం..! వీవీప్యాట్లు లెక్కించేందుకు సమయం పడుతుందన్న సీఈఓ ద్వివేది..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో రాజకీయ పార్టీలకు విరహ వేదన తప్పేట్టు లేదు. ఎప్పుడు మే 23వ తారీఖు వస్తుందా.. ఎప్పుడు ఎన్నికల ఫలితాలు తెలుసుకుందామా అనుకుంటున్న రాజకీయ పార్టీలు, ఫలితాలు తెలుసుకునేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపిలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరి మరికాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఈవీఎంల లెక్కింపుతో ట్రెండ్ మాత్రమే తెలిసే అవకాశం ఉందని, నియోజకవర్గానికి ఐదు బూత్లలో వీవీప్యాట్లు లెక్కించేందుకు సమయం పడుతుందన్నారు. ప్రతి నియోజక వర్గంలో ఐదు బూత్లకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్లు లెక్కించాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీ, లోక్సభ పరిధిలో పది వీవీప్యాట్లను లెక్కించాల్సి రావడంతో ఆలస్యమవుతుందన్నారు ద్వివేది.
ప్రతి అసెంబ్లీ, లోక్సభ పరిధిలో పదివేలకు పైగా వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సి వస్తుందన్నారు. వీవీప్యాట్ల కౌంటింగ్ బాధ్యత ఆర్వోలు, పరిశీలకులదేనన్నారు. వీవీప్యాట్ కౌంటింగ్ ముగిసిన తర్వాతే ఫలితాల వెల్లడి చేస్తామన్నారు. ఓటర్ల సంఖ్య బట్టి కొన్ని చోట్ల ఫలితాల వెల్లడి ఆలస్యం కావొచ్చు. మొదట సర్వీస్ ఓటర్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేస్తారు. కౌంటింగ్ తేదీ వరకు సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు పంపొచ్చన్నారు. సీఆర్సీ చేయని ఈవీఎంల వీవీప్యాట్లకు కౌంటింగ్ నుంచి మినహాయింపునిస్తామన్నారు. పీఓ, అబ్జర్వర్ డైరీ ఆధారంగా మాక్పోల్ ఓట్లను లెక్కింపు నుంచి మినహాయిస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ లెక్కల్లో తేడా ఉంటే ఆర్వో, అబ్జర్వర్లు ఏం చేయాలో నిర్ణయిస్తారు. ఈ తతంగంతో పాటు వివిప్యాట్ లెక్కింపు ఎన్నికల ఫలితాలను మరికొంత ఆలస్యం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.