ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి: ప్రియుడిపై యువతి ఎస్పీకి ఫిర్యాదు
అమరావతి: యువతిని ప్రేమ పేరిట మోసం చేసిన మరో యువతితో పెళ్లికి సిద్ధమైన రిటైర్డ్ కానిస్టేబుల్ కుమారుడిపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన ఓ యువతికి ప్రొద్దుటూరులోని రాజేశ్వరినగర్లో నివాసముంటున్న పఠాన్ ఇమ్రాన్ల మధ్య కొన్నేళ్లుగా ప్రేమాయణం నడుస్తోంది.
వీరిద్దరూ ఒకే కాలేజీలో చదవడంతో అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చి, జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకుందామని ఇద్దరి మధ్య పరస్పర అంగీకారం కూడా కుదిరింది. కొన్ని రోజుల తర్వాత ఆ యువతికి టీచర్ ఉద్యోగం వచ్చింది.
దీంతో ఆమె ప్రస్తుతం ప్రొద్దుటూరులోని స్థానిక మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ టీచర్గా పని చేస్తున్నారు. కాగా, ఇమ్రాన్ఖాన్ కూడా కడపలో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్నాడు. అయితే ఇమ్రాన్ఖాన్కు ఇటీవలే రూ. 10 లక్షలు నగదుతో పాటు 40 తులాల బంగారం కట్నంగా ఇస్తామని రాజంపేట నుంచి పెళ్లి సంబంధం వచ్చింది.
తన కుమారుడు ప్రేమ విషయం తెలిసినప్పటికీ అతని తండ్రి జాఫర్ఖాన్( రిటైర్టు కానిస్టేబుల్) ఈ పెళ్లి సంబంధానికి అంగీకరించాడు. దీంతో రాజంపేట నుంచి వచ్చిన సంబంధాన్ని తన కుమారుడికి కుదుర్చుకున్నారు. ఈ నెలలోనే పెళ్లిని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్కి పెళ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న ఆమె తనను మోసం చేశాడని గ్రహించి న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు కడప జిల్లా ఎస్పీని కలిసి తనకు జరిగిన అన్యాయం, ఇమ్రాన్ ఖాన్తో తనకున్న సంబంధాన్ని ఆయనకు వివరించింది.
దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో పఠాన్ ఇమ్రాన్ఖాన్, తండ్రి జాఫర్ఖాన్లపై కేసు నమోదైంది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు అతడిని రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తండ్రి మాటను కాదనలేకే వేరే యువతితో వివాహం చేసుకుంటున్నట్లు స్వయంగా ఇమ్రాన్ ఖాన్ వెల్లడించినా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని యువతి అంటోంది.