చంద్రబాబు సభల్లో తొక్కిసలాట - విచారణ మొదలు..!!
ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన చంద్రబాబు సభల్లో తొక్కిసలాట పై విచారణ మొదలైంది. కందుకూరు..గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సభల్లో 11 మంది మరణించారు. చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కసలాట..మరణాల పైన వైసీపీ సీరియస్ గా రియాక్ట్ అయింది. చంద్రబాబు ప్రచార యావతోనే ఈ ప్రమాదాలు జరిగాయని ఆరోపించింది. కందుకూరులో జరిగిన ఘటనలో 8 మంది మరణించారు. అదే విధంగా గుంటూరులో ఎన్నారై ఉయ్యూరు వెంకటరావు ఆధ్వర్యంలో ఉయ్యూరు ఫౌండేషన్ జనతా వస్త్రాల పంపిణీలో తొక్కిసలాట లో ముగ్గురు మరణించారు. ఈ రెండు ఘటనల పైన ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ విచారణ ప్రారంభించింది.
కందుకూరులో చంద్రబాబు తన ప్రచారం కోసం డ్రోన్ షాట్స్ లో ఎక్కవ మంది జనం వచ్చారని చూపించేందుకే ఇరుకు సందుల్లో సభ ఏర్పాటు చేసారని వైసీపీ ఆరోపిస్తోంది. గుంటూరు సభ పైనా రాజకీయంగా విమర్శలు కొనసాగాయి. టీడీపీ ఈ ఆరోపణలను తిప్పి కొట్టిన టీడీపీ..ఈ రెండు ఘటనల వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించింది. ఈ రెండు ఘటనలతో ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. రోడ్ల పైన సభలు..ర్యాలీల నిర్వహణ పైన ఆంక్షలు విధించింది. ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. హైకోర్టు జీవోను సస్పెన్షన్ లో పెట్టగా.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక, ప్రభుత్వం నియమించిన కమిటీ గుంటూరులో తొక్కిసలాట పైన విచారణ ప్రారంభించింది.

ప్రభుత్వం విచారణ బాధ్యతలను హైకోర్టు రిటైర్డ్ జడ్జి శేషశయనా రెడ్డికి అప్పగించింది. ఈ రోజు గుంటూరు చేరుకున్న ఆయన అధికారులతో సమీక్షించారు. ఆ రోజు జరిగిన పరిణామాలు..కేసు నమోదు పైన వివరాలు సేకరించారు. సభా ఏర్పాట్లు, నిర్వాహకులు, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలపై కావాల్సిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. బాధితుల నుంచి ఏం జరిగిందనే అంశం పైన సమాచారం రాబట్టారు. అనుమతి ఎవరు కోరారు, సభ ఎవరు నిర్వహించారు.. ఎంత మంది సభకు హాజరయ్యారు.. పోలీసు బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేసారనే అంశాల పైన ప్రధానంగా ఆరా తీసారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం ఆధారంగా విచారణ న్యాయమూర్తి తన నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు.












Click it and Unblock the Notifications