రేవంత్ రెడ్డి అరెస్టు: చంద్రబాబును టార్గెట్ చేసిన తెలంగాణ మంత్రులు
హైదరాబాద్: ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్కు లంచం ఇవ్వజూపుతూ తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి పట్టుబడడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడేట్లే కనిపిస్తున్నారు. కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి తెలంగాణ మంత్రులు చంద్రబాబును లక్ష్యం చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు మంత్రులు కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే కావడం గమనార్హం. తెలుగుదేశం వ్యవహారాలు, చంద్రబాబు వ్యవహారశైలి తమకు తెలియదా అంటూ వారు విమర్శల జోరు పెంచారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు గండి కొట్టాలని చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశాడని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను రేవంత్ కలిసి డబ్బులు ఎర చూపే ప్రయత్నం చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ను నైతికంగా దెబ్బతీయాలనే చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టిందన్నారు.

రాజకీయాన్ని కలుషితం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే టీఆర్ఎస్ నేతలను ఓడించడానికి బాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మోచేతి నీళ్లకు ఆశపడి కొందరు తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ఎర్రబెల్లి దయాకర్ రావు సమాచారం ఇచ్చి ట్రాప్ చేయించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుది అవినీతి చరిత్ర అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. డబ్బులతో ఎవరినైనా కొనాలనుకుంటారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ సహాయంతో ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ అరెస్టు కావడాన్ని ఆసరా చేసుకుని ఆయన మీడియా వద్ద చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి అసలు స్టీఫెన్ ఇంటికి ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ క్యాంప్లో ఉన్న రేవంత్ అక్కడి నుంచి ఎలా మాయమయ్యారని తలసాని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కొనుక్కునే నీచమైన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. చేసిందంతా చేసి తిరిగి బుకాయిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీలో ఎర్రబెల్లి దయాకర్ ఏక్ నంబర్ దొంగ అని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అరెస్ట్ విషయంలో కొన్ని చానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని, అన్ని విషయాలు మరికాసేపట్లో వెల్లడవుతాయని తెలిపారు. నేతలు కూడా కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యాకే స్పందించాలని టీఆర్ఎస్కు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేయవద్దని సూచించారు.
ఏసీబీ అదుపులో ఉన్న రేవంత్రెడ్డి చరిత్ర అవినీతిమయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. రేవంత్ చరిత్ర అవినీతిమయం అనడానికి ఈ రోజు జరిగిన ఘటనే నిదర్శనమని చెప్పారు. టీడీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. మనషుల్ని పశువుల్లాగా కొనే సంస్కృతి తెలుగుదేశం పార్టీదని ధ్వజమెత్తారు. స్టీఫెన్సన్కు రూ. 50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన రేవంత్ను విడుదల చేయాలనడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.
ఎవరి ప్రోద్బలంతో రేవంత్రెడ్డి ఈ పనికి పాల్పడ్డారో బయటకు తీయాలని సీనియర్ న్యాయవాది శ్రీరంగారావు డిమాండ్ చేశారు. రేవంత్ వెనక చంద్రబాబు ఉన్నాడా? లేక లోకేష్ బాబు ఉన్నాడా? తేలాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చలాంటి పని రేవంత్ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిని కోర్టు ఎదుట నిలబెట్టినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications