భీమవరంలో రేవంత్ రెడ్డి: కేసీఆర్ మెప్పుకోసమే రామలింగారెడ్డి ఆ వ్యాఖ్యలు
అమరావతి: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సందడి చేశారు. అత్త వారింట్లో రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషారెడ్డి చేస్తున్న వరలక్ష్మి వ్రతాన్ని చూసేందుకు ఆయన ఇక్కడికి వచ్చారు.
తన కుమార్తె చేస్తున్న వరలక్ష్మీ వ్రతాన్ని రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి సోఫాలో కూర్చొని ఆసక్తిగా గమనించారు. కాగా భీమవరం వచ్చిన రేవంత్ రెడ్డిని స్థానిక టీడీపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా రాజకీయాల ప్రస్తావన వచ్చింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి నయీం ఎన్కౌంటర్ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా, రాష్ట్రంలో హరీశ్ రావు మంత్రిగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్న నాయిని నరసింహారెడ్డి అప్పట్లో కడప జిల్లా ఇంఛార్జి మంత్రిగా ఉన్నారని వారే నయీంను పెంచిపోషించారా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పుకోసం లేదా భవిష్యత్తులో ఇంకేదైనా పదవి వస్తదనే ఉద్దేశంతో నయీంపై రామలింగారెడ్డి అలా మాట్లాడి ఉంటారని అన్నారు. నయీం బ్రతికున్నప్పడు రామలింగా రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుండేదని రేవంత్ రెడ్డి అన్నారు.
నయీం ఎన్ కౌంటర్ తర్వాత మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ నయీమ్ నల్లతాచు వంటి వాడని, ఆ తాచుపామును పెంచి పోషించింది చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇరవై ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని నయీం విస్తరించుకున్నాడని అన్నారు. అప్పటి తెలుగుదేశం నేతలు, అధికారుల అండదండలతో రాక్షసుడు ఎదిగాడని, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా అతనికి ఇబ్బంది ఎదురు కాలేదని ఆయన అన్నారు.