పవన్ కళ్యాణ్ ఆవేదన సరైందే.. ఆ మాటలు వాస్తవమే!: రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష కొనసాగుతుందన్న పవన్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అందులో వాస్తవముందని, పవన్ ఆవేదన సరైందేనని అన్నారు.
హైదరాబాద్: దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యాన్ని సహించేది లేదని చాలా వేదికల మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని తెలియజేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ లోను పలుమార్లు ఈ విషయంపై ఆయన స్పందించారు. ఇటీవల టీటీడీ కార్యనిర్వాహణ అధికారిగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ను నియమించడం పట్ల కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా పవన్ కళ్యాణ్ వాదనకు రేవంత్ రెడ్డి కూడా మద్దతుగా నిలిచారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష కొనసాగుతుందన్న పవన్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. అందులో వాస్తవముందని, పవన్ ఆవేదన సరైందేనని అన్నారు. ఇక ఎన్నికల్లో పొత్తుల గురించి ప్రస్తావిస్తూ.. ఎన్నికల్లన్నాక పొత్తులు సహజమన్నారు.
తెలంగాణలోని పార్టీలన్ని కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయాయని రేవంత్ అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీకైనా తాము మద్దతునిస్తామని చెప్పారు. పార్టీ అభివృద్ధి ప్రణాళికే లక్ష్యంగా మహానాడును నిర్వహిస్తున్నామని, ఐదు కీలక అంశాలపై తమ విధానాన్ని ప్రకటిస్తామని అన్నారు.