ఇకపై ప్రతినెలా రేషన్ డీలర్లతో సమీక్ష:పౌరసరఫరాల శాఖా మంత్రి పుల్లారావు
విజయవాడ: రేషన్ డీలర్ల ప్రతినిధులతో పౌరసరఫరాల శాఖా మంత్రి పుల్లారావు చర్చలు జరిపారు. చంద్రన్న విలేజ్ మాల్స్ గురించి వారితో మంత్రి చర్చించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
అంతేకాదు ఇకనుంచి ప్రతి నెలా రేషన్ డీలర్లతో సమీక్ష జరపనున్నట్లు మంత్రి పుల్లారావు మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చంద్రన్న మాల్స్ ప్రారంభించడం జరిగిందని...ఈ నెలాఖరులోగా 171 చంద్రన్న మాల్స్ ప్రారంభిస్తామన్నారు. అలాగే స్పిల్ట్ కార్డులను జులై నాటికి అందజేస్తామని, ఈనెల నుంచి తెల్లకార్డుదారులకు 2కేజీల కందిపప్పు సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు.
జూన్ 11 నుంచి 17 వరకు 12.50 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా ఇస్తామని, కొత్తగా 2.42 లక్షల రేషన్ కార్డులు అందజేస్తామని పుల్లారావు చెప్పారు.ఇకపై రేషన్ షాపులు ప్రజలకు మరిన్ని విస్తృత సేవలు అందచేసేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. అనంతరంవైకాపా అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై మంత్రి పుల్లారావు విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపిని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని పుల్లారావు అన్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.