పరామర్శ, వీసీకీ రెక్వెస్ట్ చేస్తున్నా: నేడు వర్సిటీకి వైయస్ జగన్ (ఫోటోలు)
హైదరాబాద్: వైసీపీ అధినేత వైయస్ జగన్ బుధవారం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు రానున్నారు. మంగళవారం సాయంత్రం ఉప్పల్లోని బ్యాంక్ కాలనీలో రోహిత్ తల్లి రాధిక, తమ్ముడు రాజా చైతన్యకుమార్ అద్దెకు ఉంటున్న నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు.
‘మీపక్షాన మేమున్నాం.. న్యాయం కోసం పోరాడదాం..' అని వారికి భరోసా ఇచ్చారు. సుమారు 35 నిమిషాలపాటు అక్కడే ఉన్న వైయస్ జగన్ రోహిత్ కుటుంబ పరిస్థితిని, ఆత్మహత్య జరిగిన తీరుపై ఆరా తీశారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టగానే రాధిక బోరున విలపించారు.
‘నాలాంటి దురదృష్టవంతురాలు మరే తల్లి కావద్దు. గుంటూరు సమీపంలోని పల్లెటూరులో రోజు కూలీగా టైలరింగ్ చేస్తూ వచ్చే రూ. 150తో నా బిడ్డని చదివించుకుంటున్నా.. వాడి ని పెద్ద హోదాలో చూసేందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్క చేయలేదు. పీహెచ్డీ చేసి పెద్దవాడై.. మమ్మల్ని పేదరికం నుండి బయటపడేస్తాడనుకున్నా.. కానీ మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు..'' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
రోహిత్ తల్లి రాధిక, తమ్ముడు రాజా చైతన్యకుమార్లను పరామర్శించిన అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ మొన్ననే గుంటూరులో రిషితేశ్వరి ఘటన చూశామన్నారు. అది కూడా ఇంచుమించు ఇలాందేనన్నారు. అక్కడ ఆ తల్లి చనిపోతే, అందుకు కారణమైన ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్య కూడా తీసుకొలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని చూశామన్నారు.
ఈరోజు కూడా వేముల రోహిత్ ఘటన విషయంలో రకరకాల వాదనలు వినబడుతున్నాయి. వీసీ తప్పిదం బలంగా వినిపిస్తోందన్నారు. పిల్లలకు మద్దతుగా నిలవాల్సిన వీసీలే మద్దతివ్వకుండా పిల్లలు చనిపోయే వరకు, వాళ్ల మానసిక స్థితిగతులను ప్రేరేపిస్తా ఉంటే నిజంగా బాధగా ఉందన్నారు.
ఇప్పటికైనా కూడా ఒకటే రెక్వెస్ట్ చేస్తున్నా రాజకీయాలను పక్కనపెట్టండన్నారు. హెచ్సీయూలో ఐదుగురిని సస్పెండ్ చేశారు. అందులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నలుగురు సస్పెన్షన్ ఎత్తేయండని అక్కడే టెంట్ వేసుకొని నిరాహరదీక్షలు చేస్తూ ఉన్నారు.
వాళ్లకు నిజంగా రూ. 30 వేలు స్టైఫండ్ వస్తేనే బతికే పరిస్థితి ఉందని, యూనివర్సిటీ నుంచి వెళ్లిపోమ్మంటూ సస్పెండ్ చేస్తే ఎక్కడికెళ్లాలో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారన్నారు. చదువులు ఆగిపోతాయని, క్యాంపస్ క్యాంటీన్కు వెళితే రాయితీ మీద ఫుడ్ ఉంటుంది. కానీ అక్కడికి కూడా వెళ్లొద్దంటున్నారు.
నేడు వర్సిటీకి వైయస్ జగన్
లైబ్రరీకి వెళ్లొద్దంటున్నారు. బుక్స్ కూడా కొనుక్కుని చదువుకునే పరిస్థితి లేదు. ఇటువంటి దీన పరిస్థితుల్లో పిల్లలు మా సస్పెన్షన్ ఎత్తేయండి అని అభ్యర్థిస్తా ఉన్నారు. మానవతా దృక్పథంతో కనీసం ఇప్పటికైనా కూడా వీసీ ముందుకొచ్చి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.
నేడు వర్సిటీకి వైయస్ జగన్
ఆ పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం, వారికి మనోధైర్యం నింపే కార్యక్రమం చేస్తేనే పిల్లలు కనీసం మళ్లీ కాలేజీ, యూనివర్సిటీకి వెళ్లే పరిస్థితి వస్తుంది. నేను కూడా కచ్చితంగా రేపు యూనివర్సిటీకి వెళ్లి నిరాహరదీక్ష చేస్తున్న ఆ నలుగురు పిల్లలను కలసి సంఘీభావం తెలుపుతా. వీసీకీ మరోసారి రెక్వెస్ట్ చేస్తున్నా.. మానవతా దృక్పథంతో ఆలోచించి సస్పెన్షన్ ఎత్తివేసి, పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నానన్నారు.
నేడు వర్సిటీకి వైయస్ జగన్
రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళనలు సైతం కొనసాగుతున్నాయి. వీరి నిరసనలు నాలుగో రోజుకు చేరుకోగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి నేడు హెచ్సీయూను సందర్శించనున్నారు.
నేడు వర్సిటీకి వైయస్ జగన్
దళితుల పార్టీగా పేరుపడ్డ బీఎస్పీకి అధినేత్రిగా ఉన్న మాయావతి నిన్ననే ఇద్దరు అనుచరులను వర్సిటీకి పంపి ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఇదే రోజున ఇక్కడికి రానున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా గురువారం హెచ్సీయూ రానున్నారు.