. విద్యా వ్యవస్థపై జగన్ మార్క్ : విదేశీ విద్యార్ధులతో పోటీ పడేలా - మేనమామగా అండగా..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన మూడేళ్ల పాలన ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేసుకోబోతున్నారు. ఈ మూడేళ్ల కాల పాలనలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యా బోధన తో పాటుగా పూర్తిగా సంస్కరణలతో భవితకు భరోసా ఇచ్చే బోధనకే ప్రాధాన్యత ఇచ్చారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకే ప్రతీ విద్యార్ధికి చదువు అందే విధంగా...ప్రతీ బిడ్డకు మేనమామగా అండగా నిలుస్తూ ప్రతీ ఇంటా చదువులు వెలుగులు నింపాలనేదే తమ లక్ష్యమని పదే పదే జగన్ చెబుతూ వచ్చారు. ప్రతీ తల్లీ తమ బిడ్డలను పాఠశాలలకు పంపాలని సూచించారు. అందుకోసం ప్రతీ కుటుంబానికి ఆర్దికంగానూ తోడ్పాటు అందిస్తున్నారు. నాడు - నేడు ద్వారా పాఠశాలల సమూల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాటి రూపురేఖలు మారుతున్నాయి.

సమూలంగా పాఠశాలల మార్పు
ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎమ్మెల్యే సిఫార్సు లేఖలతో ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేయటం అనేక ప్రాంతాల్లో కనిపించింది. విద్యార్ధులకు ఆంగ్ల బోధనతో పాటుగా..సీబీఐఎస్సీ విద్యా విధానం..అందునా బైలింగ్విల్ విధానం అమల్లోకి తీసుకొచ్చి.. ఏ విద్యార్ధి మీడియం మార్పుతో ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ బిడ్డ బడికి వెళ్లాలనే ఉద్దేశంతో.. తల్లులకు ప్రోత్సాహకంగా ఏడాదికి రూ 15 వేలు చొప్పున అమ్మఒడి పధకం అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది తల్లులకు ఈ పధకం ద్వారా తమ పిల్లలను బడికి పంపేలా ప్రోత్సాహం ఇస్తున్నారు. వారి పిల్లలు చదువుకుంటేనే..వారి ఇంటి భవిష్యత్ బాగుంటుందంటూ ప్రతీ సభలో సీఎం జగన్ చెబుతూ వసస్తున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా ఆంగ్ల బోధన
ఇదే సమయంలో అనేక విమర్శలు..రాజకీయంగా ఆరోపణలు ఎదురైనా ఇంగ్లీషు మీడియం విద్యా బోధన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావటం ద్వారా ప్రయివేటు విద్యా సంస్థల్లో వేల రూపాయాల ఫీజులు చెల్లించకుండానే పేదల పిల్లలకు ఆంగ్ల బోధన అందుబాటులోకి వచ్చింది. తాజాగా.. తూర్పు గోదావరి జిల్లా బెండెపూడి జెడ్పీ పాఠశాల విద్యార్ధుల ఇంగ్లీషు మాట్లాడే తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారి..అందరి ప్రశంసలు అందుకుంది. ఉపాధి కల్పించే విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని..ఆ దిశగానే సిలబస్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగిన విధంగా టీచర్లకు సైతం అవసరమైన రీతిలో శిక్షణ ఇప్పించేందుకు సిద్దమైంది. కేంబ్రిడ్జ్ సంస్థ సహకారంతో వారిలో ఇంగ్లీష్ స్కిల్స్ మరింత డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పాఠశాలలు - భోదనా తీరులో మార్పులు
పాఠశాలలను ఆరు విభాగాలుగా విభజించారు. ప్రీప్రైమరీ..ప్రైమరీ..ప్రీ హై స్కూల్స్..హైస్కూల్స్ ప్లస్ వంటి విభాగాలుగా విభజించి..టీచర్లను కేటాయించారు. ఇక, విద్యార్ధులకు చదువుతో పాటుగా వారి శారీరక సామర్ధ్యం కోసం జగనన్న గోరు ముద్ద పధకం పేరుతో న్యూట్రీషన్ లేకుండా ఏ విద్యార్ధి ఇబ్బంది పడకుండా ఈ పధకం అమలు చేస్తున్నారు. సర్వ శిక్ష అభియాన్ నుంచి ప్రభుత్వ విభాగాల్లోని ప్రైమరీ పాఠశాలల్లో ఈ పథకం అమలు అవుతోంది. 202లో జగనన్న విద్యా కానుక పధకం ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్ధులకు మూడు జతల యూనిఫాం తో పాటుగా రెండు జతల సాక్స్.. ఒక జత షూ.. బెల్టు..పాఠ్యపుస్తకాలు..స్కూల్ బ్యాగ్ అందిస్తూ..డ్రాపవుట్స్ తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.

పౌష్ఠికాహారం - మౌళిక వసతులు
2019 నవంబర్ 14న నాడు - నేడు పథకం ప్రారంభించిన సీఎం జగన్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించారు. పిల్లలకు గతంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారంలో భాగంగా వాళ్లకు టాయిలెట్స్ ఏర్పాటుతో పాటుగా ..సురక్షిత మంచి నీరు.. నాణ్యమైన బిల్డింగ్స్.. ప్రతీ తరగతి గదిలో ట్యూబ్ లైట్లు..ఫ్యాన్లు.. బడులకు రంగులు.. ఇంగ్లీషు లాబ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన - వసతి దీవెన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కారణంగా నిలిచాయి. పేద..అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్దుల ట్యూషన్ ఫీజుతో పాటుగా పరీక్ష్ ఫీజు వంటికి సైతం ప్రభుత్వం పూర్తిగా రీ ఎంబర్స్ చేస్తుంది. అదే విధంగా వసతి దీవెన కింద విద్యార్ధులు వసతి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇటువంటి వినూత్న పథకాలతో.. ఎక్కడా ఎటువంటి అవినీతి- సిఫార్సులకు తావు లేకుండా అర్హులందరికీ వీటిని అందిస్తూ..విద్యా వ్యవస్థలో మార్పుల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.












Click it and Unblock the Notifications