జగన్ వర్సెస్ చంద్రబాబు- ఇద్దరి గుట్టు ఆ ఇద్దరి చేతిలో : ఒకే స్కూల్ మాష్టర్స్ తో - గెలిచేదెవరు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. సీఎం జగన్ వర్సెస్ చంద్రబాబు ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఈ ఇద్దరికీ ఈ సారి గెలుపు పార్టీ పరంగానే కాదు..వ్యక్తిగతంగానూ ప్రతిష్ఠగా మారింది. దీంతో..2019 లో జగన్ విజయం వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. రాకీయంగా వ్యూహాలు - సర్వేలు అందిస్తూ.. ప్రచారంలో సూచనలు చేస్తూ జగన్ విజయానికి తోడ్పాటు అందించారు. ఆ సమయంలో రాజకీయ వ్యూహకర్తను జగన్ నియమించుకోవటం పైన వ్యంగాస్త్రాలు సంధించిన టీడీపీ ఈ సారి ఎన్నికల కోసం రాబిన్ శర్మను తమ వ్యూహకర్తగా ఒప్పందం చేసుకుంది.
ఏ అవకాశం వదులుకోని చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో ఏ విధంగానూ ఏ ఆప్షన్ వదులుకోకూడదని నిర్ణయించింది. అందులో భాగామే ఈ వ్యూహకర్త సేవలు. ఇప్పటికే ఆయన సోషల్ మీడియా.. ప్రచారం తీరు పైన సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. అటు వైసీపీకి ప్రశాంత్ కిషోర్ స్థానంలో రుషి రాజ్ సింగ్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. అటు టీడీపీ..ఇటు వైసీపీ ఇద్దరికీ సేవలు అందిస్తున్న వారిద్దరూ ఐ ప్యాక్ లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి సంస్థ సహ వ్యవస్థాపకులుగా వ్యవహరించారు. ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీల గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఆ గెలుపుల్లో ప్రశాంత్ కిషోర్ వెనుక ఈ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఏపీలో అధికారం కోసం జరుగుతున్న గేమ్ లో రెండు పార్టీల్లోనూ తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు.
మరింత పక్కగా సీఎం జగన్
2019 ఎన్నికల్లోనూ వైసీపీ కోసం పని చేసిన రుషి రాజ్ సింగ్ కు జగన్ బలాలు - బలహీనతలు పూర్తిగా తెలుసు. ఇప్పుడు తిరిగి అధికారం నిలబెట్టుకొనేందుకు తన టీంతో కలిసి సహకారం అందిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకే రుషి ఎంపిక జరిగిందని సమాచారం. ఇటు జగన్ తో పాటుగా చంద్రబాబుకు సంబంధించిన అన్ని వ్యవహారాల పైన అవగాహన ఉంది.
ఇక, చంద్రబాబు విజయం కోసం వ్యూహాలు అమలు చేస్తున్న రాబిన్ శర్మ గతంలో రుషి రాజ్ సింగ్ తో కలిసే పనిచేసే వారు. ఆయనకు సైతం జగన్ కు సంబంధించిన రాజకీయ బలాలు - మద్దతు - కలిసొచ్చే అంశాల పైన పూర్తి అవగాహన ఉంది. దీని కారణంగానే... ఆయన్ను చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. చంద్రబాబు పర్యటనలు.. సభల నిర్వహణ - రాజకీయంగా అధికార వైసీపీని టార్గెట్ చేయటం.. మేనేజ్ మెంట్ స్కిల్స్ పైన సూచనలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు నేతలు - ఇద్దరు వ్యూహకర్తలు
దీంతో..వైసీపీ - టీడీపీ రెండు పార్టీలకు ఒకే స్కూల్ నుంచి వచ్చిన ఇద్దరు మాష్టర్లు వెనుక ఉండి అధికారం దక్కించుకొనేందుకు అటు సీఎం జగన్.. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబును నడిపిస్తున్నారు. దీంతో.. ఈ మాష్టర్ల వద్ద ట్యూషన్ తీసుకుంటున్న ఈ ఇద్దరూ ఇక హోరా హోరీగా గ్రౌండ్ లో పోటీ పడేందుకు సిద్దం అవుతున్నారు.
ఇప్పుడు వీరిద్దరి గుట్టు మొత్తం ఆ ఇద్దరి మాష్టర్ల చేతిలో ఉండటంతో...వీరి పాత్ర సైతం కీలకంగా మారుతోంది. దీంతో..ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయి.. వీరిద్దరి మాటలు ఈ ఇద్దరు నేతలు ఎంత వరకు అమలు చేస్తారు.. ఎవరు చివరికి గెలుస్తారనేది ఏపీ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ డిబేట్ గా మారుతోంది.