సీఎం వర్సెస్ గల్లా: ఏపీ టీడీపీలో ఒలింపిక్ చిచ్చు, టీ ఏకగ్రీవం
హైదరాబాద్: ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య అగ్గి రాజేశాయి. ఇప్పటికే ఎన్నికల్లో తాను ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ చెబుతుండగా, ఆ ఎన్నికను తాము పరిగణలోకి తీసుకోమని తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చెబుతున్నారు.
ఈ విషయమై ఇరువురి నేతల మధ్య మాటల యుద్ధం కనిపించింది. తమకే ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ గుర్తింపు ఉందని సీఎం రమేష్ చెబుతున్నారు. తమదే అసలైన సంఘం అన్నారు. మరోవైపు, గల్లా జయదేవ్ ప్రతినిధులు దీనిని రాజకీయం చేయవద్దని, సీఎం రమేష్ను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక వివాదంపై ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ఈ నెల 4నే తిరుపతిలో ఐఓఏ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలో తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని చెప్పారు. దీనిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. క్రీడల్లో రాజకీయాలకు తావులేదని, తాను జాతీయ స్థాయి క్రీడాకారుడిని అని అన్నారు. సీఎం రమేష్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి ఎన్నిక కోసం గత నెల 4న ఎలక్షన్లు నిర్వహించారు. అప్పుడు జయదేవ్ ఎన్నికయ్యారు. ఇప్పుడు సీఎం రమేష్ దానిని కాదంటూ అధ్యక్షుడిగా రంగంలోకి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య రాద్దాంతం చోటు చేసుకుంది.
చైర్మన్ పదవికి గల్లా నో!
గల్లా జయదేవ్ ఎన్నికలు కాదని చెబుతున్న సీఎం రమేష్ వర్గం ఆయనకు చైర్మన్ పదవిని ఇచ్చేందుకు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిని గల్లా జయదేవ్ తిరస్కరించారని సమాచారం. దీంతో మంత్రి గంటా శ్రీనివాస రావును చైర్మన్ పదవికి అనుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా జగదీశ్వర్ రెడ్డి
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ ఒలింపిక్ అధ్యక్షుడిగా తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కొత్త మలుపు
తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ... కోర్టు ఆదేశాల మేరకు ఒలింపిక్ సంఘానికి వేర్వేరుగా ఎన్నికలు జరిగాయన్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి, ఏపీ అధ్యక్షుడిగా సీఎం రమేష్ ఎన్నికయ్యారని చెప్పారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి.