శివగామి, భళ్లాలదేవుడు: సోనియా, బాబుపై రోజా సెటైర్లు, ‘సోదిరెడ్డి, కలెక్షన్ కింగ్ నారాయణ’
చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీపైనా రోజా విమర్శలు చేశారు.
ఢిల్లీలో శివగామి (సోనియా గాంధీ), ఏపీలో భల్లాలదేవుడు (చంద్రబాబు నాయుడు) ని తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాహుబలిలా ఎదిరించారని రోజా అన్నారు. నాలుగేళ్ల నుంచి టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. అటువంటి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని రోజా పిలుపునిచ్చారు.
చిరునవ్వుతో.. గర్వంగా ఉంది..
శుక్రవారం ఓ సమావేశంలో రోజా మాట్లాడుతూ... జగన్పై తప్పుడు కేసులు పెట్టించి ఆయనను 16 నెలలు జైల్లో పెట్టించారని అన్నారు. అయినా.. జగన్ చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడి దగ్గర పని చేసేందుకు గర్వంగా ఉందని అన్నారు.
చంద్రబాబు దగ్గరుంటే తలదించుకోవాల్సిందే..
చంద్రబాబునాయుడు వెంట ఉన్న నాయకులు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతను మోసం చేశారని, ఆయనపై యువత తిరగబడతారని అన్నారు.
సోదిరెడ్డి, కలెక్షన్ కింగ్
నెల్లూరు జిల్లాకొస్తే ఇద్దరి గురించి మాట్లాడాల్సి వస్తుందని, ఒకరు సోదిరెడ్డి అని, మరొకరు కలెక్షన్ కింగ్ అంటూ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలనుద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి.. వ్యవసాయం గురించి తప్ప మిగితా అన్నింటి గురించి మాట్లాడతారని రోజా అన్నారు.
ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావని, కానీ, ఏకధాటిగా ఐదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి మాత్రం మంత్రి పదవి వచ్చిందని అన్నారు.
నారాయణపై తీవ్ర విమర్శలు
‘ఇక కలెక్షన్ కింగ్ నారాయణ గురించి మాట్లాడాలంటే.. ఆయనకు ఓట్లడిగే ధైర్యం లేదు. డబ్బులు పెట్టి టీడీపీకి బీనామీగా ఉన్నారని మారారని అన్నారు. ఇప్పుడు దానికి చక్ర వడ్డీ వసూలు చేస్తున్నారని అన్నారు. రాజధానిలో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు' అని రోజా ఆరోపించారు. నారాయణ కాలేజీలో లక్షల ఫీజులు వసూలు చేస్తారని, కానీ, కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారి కుటుంబాలకు పరిహారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.