తెలంగాణ అన్యాయం చేస్తున్నా! బాబు నోరు మెదపరు: రోజా ఫైర్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. రాయలసీమకు అన్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
పాదయాత్రగా వచ్చిన రోజా.. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ... గాలేరు నగరి ప్రాజెక్ట్ సాధనకు 88 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు.
అలాగే ఈ ప్రాజెక్ట్పై ప్రభుత్వం స్పందించాలన్నారు. త్వరితగిన ప్రాజెక్టును పూర్తి చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న పట్టిసీమ ద్వారా రాయలసీమకు చుక్కనీరు రాలేదని రోజా అన్నారు.
కాగా, శ్రీవారి దర్శనానికి తనకు టికెట్లు ఇవ్వాలని కోరినా టీటీడీ పక్షపాతంతో నిరాకరించిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, రోజా టీటీడీ నిబంధనలు అతిక్రమిస్తూ రాజకీయ ప్రసంగం చేసినప్పటికీ టీటీడీ కాని, విజిలెన్స్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కానీ ఆమెకు అడ్డుచెప్పకపోవడం గమనార్హం.