నన్ను అవమానించారు, నేను ఎమ్మెల్యేగా ఉండటం వేస్ట్: రోజా సంచలనం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు రాకుండా తనను అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని తనపై దౌర్జన్యం చేశారని రోజా ఆరోపించారు. ఏపీ డీజీపీ చట్టబద్ధంగా నడుచుకోవడం లేదని అన్నారు. ఆయన చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తున్నారని అన్నారు. ఏపీలో ఉండే అర్హత తనకు లేదా? అని రోజా ప్రశ్నించారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సాక్షిగా తనను అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళల హక్కుల కోసం పోరాడే హక్కు తనకు లేదా? అంటూ ఆమె నిలదీశారు. అలా లేనప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా వేస్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు టీడీపీలో ఉన్నప్పుడు ట్రాక్ రికార్డ్ గుర్తు లేదా? అంటూ తెలుగుదేశం నేతలను ఆమె ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీ నుంచి తనను ఏడాదిపాటు కావాలనే సస్పెండ్ చేశారని అన్నారు.
రాష్ట్రంలోని అనేక సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని చెప్పారు.
తాను సాటి మహిళలల్లో మనోధైర్యం పెంచేందుకే మీడియా ముందుకు వచ్చానని అన్నారు. తమ హక్కులను కాలరాసినందుకు న్యాయపోరాటం చేస్తామని రోజా చెప్పారు.
రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో తమ పోరాటం వల్లే ఆమె తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాస్ అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పారు.
విశాఖలో బీచ్ ఫెస్ట్ పేరుతో జరిగే అరాచాకాన్ని అడ్డుకున్నామని, కాల్మనీ సెక్స్ రాకెట్ ఘటనలపై పోరాటం చేశామని చెప్పారు. ఇప్పుడు మద్యపానంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. తనపై ఏ రిపోర్ట్ వచ్చిందో చెప్పమనండి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలు, టీడీపీ నేతల రేప్ల గురించిన నివేదికలు మాత్రం ఉండవంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన సదస్సులో కాల్మనీ సెక్స్ రాకెట్ బాధితుల సాయంపై చర్చించారా? అని రోజా నిలదీశారు. భజన పరులకే మహిళా పార్లమెంటేరియన్ సదస్సు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు, డీజీపీ విజయవాడలో మకాం వేసిన తర్వాతనే టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని రోజా ఆరోపించారు.












Click it and Unblock the Notifications