అడ్డంగా దొరికిన దొంగవి, జీవితాంతం జైల్లో ఉంటావ్: బాబుపై రోజా నిప్పులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి సహకరిస్తామని తమ పార్టీ అధినేత వైయస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి సహకరిస్తామని తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పగానే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎందుకంతా ఉలికిపాటు అంటూ నిలదీశారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నది టీడీపీనే కదా? అని ప్రశ్నించారు. ఆమె గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
దీన్ని బట్టి చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ మీద టీడీపీకి నమ్మకం లేదని స్పష్టమవుతోందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీకి తాము మద్దతుగా నిలిచామని, అలాగని టీడీపీతో చేతులు కలిపినట్లా? అని రోజా ప్రశ్నించారు.
మీరు కూడా మోడీని చాలా సార్లు కలిశారు.. స్వప్రయోజనాల కోసం కలిశారా? తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వెళ్లారా? అని చంద్రబాబును ప్రశ్నించారు.

అడ్డంగా దొరికిన దొంగ
రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అక్రమంగా జగన్ను జైల్లో పెట్టారని రోజా ఆరోపించారు. నిర్దోషిగా జగన్ బయటపడ్డారని టీడీపీ నేతలకు కూడా తెలుసని, అది ప్రజలకు కూడా తెలుసని రోజా అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవి అంటూ చంద్రబాబుపై రోజా తీవ్రంగా స్పందించారు. ఆడియో, వీడియోల సహా దొరికిన చంద్రబాబు.. నిజాయితీ దర్యాప్తు చేయించుకుంటే జీవితాంతం జైల్లోనే ఉంటారని అన్నారు.

ఈ మంత్రులా విమర్శించేది..
సొంత నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వలేని మంత్రి దేవినేని ఉమ.. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారా? అంటూ విమర్శించారు. మరో అడ్డగోలు మంత్రి అంటూ అచ్చెన్నాయుడిపై రోజా విమర్శించారు. అవినీతి, మహిళా అధికారులపై వేధింపులు, సొంత అన్నయ్య కుటుంబాన్ని కూడా వేధింపులకు గురిచేస్తున్నాడని అచ్చెన్నాయుడిపై రోజా దుయ్యబట్టారు.

అందుకే భయపడుతున్నారు..
రాష్ట్రపతి ఎన్నిక గౌరవప్రదమైనదని, ఎన్నిక పెట్టకూడదని జగన్ స్పష్టం చేశారని చెప్పారు. పోటీ పెట్టడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని జగన్ చెప్పిన తర్వాత కూడా టీడీపీ వాళ్లు విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబుకు సంబంధించిన రూ. 2లక్షల కోట్ల అవినీతిపై మోడీకి జగన్ ఆధారలిచ్చారనే భయపడున్నట్లున్నారని అన్నారు. పత్రికలు జగన్ పై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వల్లే ప్రజలు బాబును ఎన్నుకున్నారని, ఇప్పుడు ఆయన పాలనలో కష్టాలు పడుతున్నారని రోజా అన్నారు.

రాష్ట్ర ప్రజల కోసమే..
తన ఆరోగ్యానికి హాని అని తెలిసినా కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిరసన దీక్షలు చేపడుతున్నారని రోజా చెప్పారు. మోడీని రాష్ట్ర ప్రజల సమస్యలను తెలిపేందుకే జగన్ కలిశారని రోజా తెలిపారు. రాజీనామా చేయకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

జైల్లో ఉంటాడని తెలుసు..
అగ్రిగోల్డ్ బాధితుల న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. లోకేష్, టీడీపీ నేతలు ఉండటం వల్లే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడం లేదని రోజా ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం పూర్తి చేయాల్సి ఉండగా, డబ్బులు నొక్కేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని రోజా స్పష్టం చేశారు. హోదా కోసం లోకేష్ మాట్లాడితే తన తండ్రి జైల్లో ఉంటాడని అతనికి తెలుసని, అందుకే మాట్లాడటం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications