అమెరికాలో తెలుగు యువతి మృతి: ఉన్నత చదువులకు వెళ్లి విషాదం
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది.
కర్నూలు: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందారు. గత మూడు రోజుల క్రితం అమెరికాలో అక్కడి నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా, అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది.
కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీలో నివాసం ఉంటున్న కందుల శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరి పెద్ద కుమార్తె జాహ్నవి(23) డిగ్రీ పూర్తి చేసి.. ఉన్నత చదువుల కోసం 2021, సెప్టెంబర్ 20న అమెరికా వెళ్లారు. కాగా, జనవరి 23న కాలేజీకి వెళ్లి రాత్రి సమయంలో ఇంటికి బయల్దేరారు.
రహదారి దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం జాహ్నవిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు మరుసటి రోజు తమకు సమాచారం అందిందని చెబుతూ యువతి తాత సూరిబాబు కన్నీటిపర్యంతమయ్యారు. మరో నాలుగైదు నెలల్లో చదువు పూర్తవుతుందని, ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలుస్తుందనుకున్న సమయంలో ఈ ప్రమాదం తమకు కన్నీరే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుమార్తె జాహ్నవి మృతి చెందిందన్న వార్త విని ఆమె తల్లి విజయలక్ష్మి కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో జాహ్నవి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి.. వారం రోజుల్లోనే ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడం విచారకరం.