వారసుడ్ని చూసేందుకు వెళుతూ.. తండ్రి, తాత, నానమ్మల మృతి
పశ్చిమగోదావరి: వారసుడిని చూసేందుకు కుటుంబసమేతంగా ఆనందంతో వెడుతున్న ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో వారి ప్రాణాలను బలిగొంది. ఆ కుటుంబానికి విషాదం మిగిల్చింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖపట్నం నగరానికి చెందిన చల్లా అరుణకుమార్(30), తల్లిదండ్రులు గంగునాయుడు(55), పార్వతి(50)లతో కలసి తాడేపల్లిగూడెం ఆస్పత్రిలో ప్రసవించిన తన భార్య నళినిని, కుమారుడిని చూసేందుకు శనివారం రాత్రి విశాఖపట్నం నుంచి బయలుదేరారు.
ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు దొంగరావిపాలెం వద్ద కల్వర్టును కారు ఢీకొనడంతో అరుణ్కుమార్, గంగునాయుడు, పార్వతి ఘటనాస్థలంలోనే మృతి చెం దారు. అదేకారులో ప్రయాణిస్తున్న అరుణకుమార్ సోదరి చల్లా సునీత, అతని స్నేహితుడు చలపతిలకు తీవ్రగాయాలు తగలడంతో తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అరుణకుమార్ భార్య నళిని తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం మగబిడ్డను ప్రసవించింది. శనివారం రాత్రి తమ మనవడిని చూడాలన్న గంగునాయుడు, పార్వతిలను కారులో తానే డ్రైవ్ చేసుకుంటూ అరుణకుమార్ తీసుకువస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెనుగొండ ఎస్ఐ వెంకటే శ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.