పల్టీలు కొట్టిన కారు: అమెరికాలో ఇద్దరు తెలుగు యువకుల మృతి
వాషింగ్టన్: అమెరికాలోని లూయిస్విల్లీలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు మృతి చెందారు. ఓ అమెరికన్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. లూయిస్ విల్లీలోని నార్త్ బెండ్ రోడ్డుపై ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో రామ వరాహభట్ల(35), రాజశేఖర్ రెడ్డి యర్మాల(25), వెంకటప్రశాంత్ కొమ్ము(27), అన్వేష్ కుమార్(24)లు కారులో వేగంగా వెళ్తున్నారు.
కారును నడుపుతున్న రామ ముందు ఉన్న భారీ టర్నింగ్ ను గుర్తించకపోవడంతో అదుపుతప్పిన కారు పక్కకు దూసుకెళ్లింది. పలుమార్లు పల్టీలు కొట్టిన కారు ఆ తర్వాత ఓ చెట్టును ఢీ కొట్టింది. దీంతో వాహనంలోని వారంతా తీవ్రంగా గాయపడ్డారు. కాగా, కారు వెనుక భాగంలోనే కూర్చున్న ప్రశాంత్ కారు డోర్ ఓపెన్ చేయడంతో కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఘటనా స్ధలానికి చేరుకున్న హబ్రాన్ ఫైర్ సర్వీసు అధికారులు కారులో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసీ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజశేఖర్ను యూనివర్సిటీ ఆఫ్ సిన్సిన్నాటి మెడికల్ సెంటర్(యూసీఎమ్సీ)కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
రాజశేఖర్ స్వగ్రామం కృష్ణా జిల్లాలోని మథిరగా సమాచారం. యూసీఎమ్ సీ, సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అన్వేష్, రామ లకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాగా, ఘటనలో గాయపడిన వారి గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications