అందుకే నాపై చంద్రబాబు అనుకూల మీడియాలో బద్నాం: రోజా
చంద్రబాబు తనపై మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తూ తనను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎదిరించి నిలుచున్నానని, అందుకే ఆయనకు అనుకూలమైనమీడియాలో తనపై తనను బద్నాం చేసి పంపించాలనే ప్రయత్నం చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు రోజా ఆరోపించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు చాలా మంది వస్తున్నారని అంటూ కానీ ఏపీలో మహిళలు, రైతులు, పేదల కన్నీళ్లు తుడవడానికి అడుగడుగున తిరిగిన బృందాకారత్, మేధాపట్కర్ లాంటివాళ్లను సదస్సుకు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.
మహిళా సాధికారత మీద డిక్లరేషన్ చేయడానికి తమ పార్టీ మద్దతు తెలుపుతుందని, కానీ అక్కడికి వచ్చే వ్యక్తులపై తమకు అనుమానం ఉందని, అలాంటివారిపై కూడా డిక్లరేషన్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలపై అరాచకాలు చేయించడంలో, అన్యాయంగా వాళ్లను తొక్కేయటంలో చంద్రబాబు ఏపీని అడ్డాగా మార్చేశారని, అలాంటివారు ఈ సదస్సుకు వచ్చే అర్హత లేదని ఆమె అన్నారు.
డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేని చంద్రబాబుకు మహిళా పార్లమెంటేరియన్ సదస్సులో మాట్టాడే నైతిక హక్కు లేదని, ఒకే వేళ సదస్సుకు ఆయన రావాలంటే ముందు మహిళలకి క్షమాపణ చెప్పి సదస్సులో పాల్గొనాలని రోజా అన్నారు.
మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు రూ. 12 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆమె విమర్శించారు. మహిళలకు చేసిన అన్యాయాన్ని కప్పి పుచ్చుకునేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాటే శాసనంగా ఐపీఎస్లు వ్యవహరిస్తున్నారని, ఈ సదస్సుకు వైసీపీ మహిళా శాసన సభ్యులు హాజరవుతారని రోజ స్పష్టం చేశారు.