కుటుంబ సమేతంగా రోజా పుష్కర స్నానం: ఏర్పాట్లపై బాబు
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు, సినీ నటి రోజా కుటుంబ సమేతంగా గోదావరి పుష్కర స్నానం ఆచరించారు. శనివారంనాడు ఆమె కుటుంబ సమేతంగా రాజమండ్రిలోని విఐపి ఘాట్లో పుష్కర స్నానం చేశారు. గోదావరమ్మ తల్లికి ఆమె నీరాజనం అర్పిచారు.
ఇదిలావుంటే, శనివారంనాడు రాజమండ్రి విఐపి ఘాట్ వద్ద సందడి చోటు చేసుకుంది. శనివారం ఉదయం నుంచే పలువురు విఐపిలు పుష్కర స్నానాలకు బారులు తీరారు. వరుస సెలవులు రావడంతో గోదావరిలో పుష్కర స్నానానికి పెద్ద యెత్తున తరలి వచ్చారు. రాజమండ్రి వైపు వెళ్లే రహదారులు వాహనాలతో క్రిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సౌకర్యాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. పుష్కరాలకు వస్తున్న భక్తుల కోసం హైవేల పక్కన రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మంచినీరు, మజ్జిగ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రోజులో 22 గంటల పాటు పుష్కరస్నానాలకు అవకాశం ఉందని తెలిపారు.
టోల్ఫీజు వసూలు చేయవద్దని ఆదేశించారు. రాజమండ్రిలో 300 సిటీ బస్సులకు వెహికల్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పుష్కరాల్లో కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు ఈనెల 26న అవార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఆహారం పంపిణీ చేసేవాళ్లకు సబ్సీడీ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.