సభలో రోజా హల్చల్: ఉపాధ్యక్ష ఎన్నిక ట్విస్ట్, సతీష్..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, నగరి శాసన సభ్యురాలు రోజా బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హంగామా చేశారు. సభలో రోజా తీరు పైన అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు మండిపడ్డారు. సభలో హుందాగా వ్యవహరించాలని రోజాకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులకు హితవు పలికారు. సభలో రోజా కెమరాకు పేపర్ అడ్డు పెట్టారు. దీంతో అధికార పార్టీ విమర్శలు గుప్పించింది. రోజా తీరు పైన చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, రోజా తీరుపై తాము స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై యనమల నిప్పులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చిత్తూరు జిల్లా తిరుపతిలో మండిపడ్డారు. రాజధాని పైన ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏదేదో ఊహించుకొని రాద్దాంతం చేస్తోందని యనమల విమర్శించారు.
సభా సంప్రదాయాల పైన ఆ పార్టీకి గౌరవం లేదన్నారు. స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవన్నారు. టీటీడీలోని ఆడిట్ అభ్యంతరాలపై ప్రభుత్వం తరఫున కమిటీని వేస్తామన్నారు. రాజధానికి కేంద్రం నుండి సహకారం ఉంటుందన్నారు. రాజధాని పైన ప్రకటన చేశాక చర్చకు అవకాశముండదని యనమల చెప్పారు.
తెరపైకి చైతన్యరాజు స్థానంలో సతీష్ రెడ్డి పేరు
ఏపీ శాసన మండలి ఉపాధ్యక్ష ఎన్నికల్లో సమీకరణాలు మారుతున్నాయి. చైతన్యరాజుకు బదులుగా సతీష్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. కొంతమంది సభ్యులు చైతన్యరాజును వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు తరఫున ఇప్పటికే కంతేటి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టే యత్నంలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణను కలిశారు. మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
ట్విస్ట్
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవానికి తాము వ్యతిరేకం కాదని బొత్స తెలిపారు. మద్దతు ఇవ్వవల్సిందిగా సతీష్ రెడ్డి, ఇతర టీడీపీ నేతలతో ఆయన మాట్లాడుతూ.. మిగిలిన పార్టీలతో సర్దుపాటు చేసుకోవాలని సూచించారు. పోటీలో ఉండాలన్న ఆలోచన తమకు లేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కంతేటి సత్యనారాయణ పోటీ నుండి విరమించుకున్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేసిన గంటలోనే విత్ డ్రా చేసుకున్నారు. దాంతో మండలి వైస్ చైర్మన్గా సతీష్ రెడ్డి ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది.