వ్యవసాయం లేకుండా చేస్తారా: బాబు సింగపూర్ మాటపై రోజా
తిరుపతి/ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రముఖ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శానససభ్యురాలు రోజా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను సింగపూర్ చేస్తానంటూ ఊదరగొడుతున్నారని, సింగపూర్లో వ్యవసాయం అంటూ లేదని, ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం లేకుండా చేయాలనేదే చంద్రబాబు ముఖ్య ఉద్దేశ్యమని ఆమె అన్నారు.
తిరుపతిలోని గాజులమండెం షుగర్ ఫ్యాక్టరీ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సోమవారం మహాధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రోజా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెండింగులో ఉన్న కోట్ల రూపాయల బకాయిలను రైతులకు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. మొక్కలోనే వ్యవసాయాన్ని తుంచేయాలనే విధంగా షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు ఇవ్వకుండా చంద్రబాబు వ్యవహరించడం దారుణమని ఆమె అన్నారు.
పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారి పరం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆమె అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే పంచదార కర్మాగారం బకాయిల చెల్లింపునకు రూ.300 కోట్లు విడుదల చేశారని ఆమె చెప్పారు.

నేనున్నానంటూ వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు ధైర్యం ఇచ్చారని చెప్పారు. అలాంటిది చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు వ్యవసాయాన్ని పండుగ చేస్తాను, రుణాలు మాఫీ చేస్తాను అంటూ రైతులను అబద్ధాల హామీలతో మోసం చేశారని ఆమె విమర్శించారు. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆమె విమర్శించారు. రైతుల నుంచి చెరుకును టన్నుకు మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.
భూమా నాగిరెడ్డికి జగన్ పరామర్శ
కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వైయస్ జగన్ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. భూమా నాగిరెడ్డి తల్లి భూమా ఈశ్వరమ్మ (80) సోమవారం ఉదయం హైదరాబాదులోని స్వగృహంలో మరణించారు.












Click it and Unblock the Notifications