టెన్షన్.. రిషికేశ్వరి ఖరీదు 500 గజాలా, సెటిల్మెంట్ సీఎం: బాబుపై రోజా సంచలనం
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రిషికేశ్వరి మృతి నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా విశ్వవిద్యాలయం వద్దకు వచ్చారు.
దీంతో వారిని అడ్డుకునేందుకు విశ్వవిద్యాలయం వద్ద భారీ బందోబస్తును ఉంచారు. రిషికేశ్వరి మృతి పైన వైసిపి నిజనిర్ధారణ కమిటీ వేసింది. వారు విచారించేందుకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. నేతలు విశ్వవిద్యాలయంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు.
మరోవైపు రిషికేశ్వరి మృతి పైన జ్యూడిషియల్ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. దీనిని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపల్ బాబురావును వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో నాగార్జున వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. వారి మధ్య వాగ్వాదం జరిగింది.
చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు

రిషికేశ్వరి మృతి పైన వైసీపీ నిజనిర్ధారణ కమిటీ విశ్వవిద్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. చంద్రబాబు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అండదండతోనే ప్రిన్సిపల్ బాబురావు రెచ్చిపోయారని మండిపడ్డారు.
ర్యాగింగ్ కళాశాలల్లో చాలా రోజులుగా జరుగుతోందని, ఇప్పుడు బయటకు వచ్చిందన్నారు. రిషికేశ్వరి మృతి పైన ఎలాంటి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆమె మృతికి ప్రిన్సిపల్, విద్యార్థులు కారణం కాదా అని ప్రశ్నించారు. బాబురావును ఏ1గా చేర్చాలన్నారు.
రిషికేశ్వరి మృతి పైన సరైన చర్యలు తీసుకుంటే నిన్న సునీత చనిపోయి ఉండకపోయేదన్నారు. సూసైడ్ చేసుకుంటే పోలీసులకు ఎందుకు సమాచారం అందించలేదని, హడావుడిగా సెలవులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
ప్రిన్సిపల్ వికృత చేష్టలను మొదటి మీటింగులోనే విద్యార్థులు బయటపెట్టారని చెప్పారు. ఆడబిల్లలతో భోజనం తినిపించుకోవడం, అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రిన్సిపల్ బాబురావు చేసినట్లు విద్యార్థులు చెప్పారన్నారు. బాబురావును కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని చెప్పారు. ఆడపిల్ల ఆత్మహత్య ఖరీదు రూ.10 లక్షలు, 500 గజాల స్థలమా అని ప్రశ్నించారు. రిషికేశ్వరి మృతి పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కానీ తూతూ మంత్రంగా విచారణ కమిటీ వేశారన్నారు.
చంద్రబాబు సెటిల్మెంట్ సీఎంగా మారిపోయారన్నారు. వనజాక్షి ఘటనలో పిలిపించి సెటిల్ చేసే ప్రయత్నం చేశారని, అలాగే రిషికేశ్వరి తల్లిదండ్రులను పిలిపించి పదిలక్షల రూపాయలిస్తామని, రాజమండ్రిలో 500 గజాల స్థలం ఇస్తామని చెప్పారని, దీంతో వారి బాధ తీరుతుందా అన్నారు.
సరైన చర్యలు లేకపోవడం వల్లే నిన్న గుంటూరులో మరో అమ్మాయి సునీత చనిపోయిందన్నారు. ఆడబిల్లలకు భరోసా ఇస్తానని చెప్పిన చంద్రబాబు కనీసం ఒక్క మహిళకు కూడా రక్షణ ఇచ్చే పరిస్థితులో లేరని మండిపడ్డారు.
చంద్రబాబుకు మహిళలు అంటే ఎందుకు ఇంత వివక్ష అని ప్రశ్నించారు. ఆయన అక్క లేదా కోడలు లేదా ఇంట్లోని మరొకరు ఇలా ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు ఇలాగే ప్రవర్తించేవారా అని ప్రశ్నించారు. రిషికేశ్వరి మృతి పైన రిపోర్ట్ తయారు చేసి తాము జగన్కు ఇస్తామని చెప్పారు.
రిషికేశ్వరికి న్యాయం జరిగే వరకు వదిలి పెట్టేది లేదన్నారు. ఆమె రాసుకున్న డైరీలోని పేజీలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. టిడిపి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిందితులకు వంత పాడుతోందన్నారు. కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, వైసీపీ నిజనిర్ధారణ కమిటీ విశ్వవిద్యాలయంలోకి వెళ్లింది.
నిందితుల బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
రిషికేశ్వరి మృతి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పైన విచారణ రేపటికి వాయిదా పడింది. నిందితులు న్యాయస్థానంలో ఇటీవల బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications