ఎన్టీఆర్ పేరుతో టీడీపీని ఏకేసిన రోజా, ఎమ్మెల్యేల సారీ
హైదరాబాద్: అసెంబ్లీలో సభా సంప్రదాయాల గురించి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు రోజా విమర్శించారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఒక్కప్పుడు సభ మర్యాదలను ఉల్లంఘించిన వారే నేడు సభా మర్యాదల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసగించేలా వ్యవహరిస్తోందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టడానికే అసెంబ్లీని ఏర్పాటు చేశారని అధికార పక్షం పైన రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ పైన చెప్పులేయించి, మైక్ ఇవ్వకుండా నాడు స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు వ్యవహరించారని, ఇప్పుడు ఆయన తమకు నీతులు చెబుతున్నారన్నారు.
సభ నిర్వహణ తీరు సక్రమంగా లేదన్నారు. డ్వాక్రా రుణమాఫీపై చర్చ కోరితే అంగీకరించలేదని, మైక్ ఇవ్వలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నరని, టీవీ ఛానల్స్ చర్చల్లో పాల్గొని జగన్ పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పైన చర్చించడం లేదని చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మహిళా ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అణా పైసలతో సహా రుణమాఫీ చేస్తామన్నారని, అయితే, అధికారంలోకి వచ్చాక మాత్రం రుణమాఫీ పైన బడ్జెట్లో ప్రస్తావనే లేకుండా పోయిందన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలను టీడీపీ మోసం చేస్తోందన్నారు. టీడీపీ కార్యకర్తలు మద్యం డోర్ డెలివరీ ఏజెంట్లు అయిపోయారని ఎద్దేవా చేశారు.
సభలో రోజా మాట్లాడుతూ... బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిది ఐరన్ లెగ్ అన్నారు. రోజా మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు, మంత్రులు పదే పదే అంతరాయం కలిగించారు. దీనిపై రోజా ఘాటుగా స్పందించారు. నా నోటికి అసలే మంచి మాటలు రావని, నేను మాట్లాడేది జాగ్రత్తగా వినాలని ఘాటుగా స్పందించారు. ఈ సమయంలో బొజ్జల... రోజాను ఐరన్ లెగ్ అన్నారు. తనది ఐరన్ లెగ్ కాదని, చంద్రబాబు పైన దాడి జరిగినప్పుడు బొజ్జల ఆ కారులోనే ఉన్నారని, వైయస్ మరణానికి ముందు క్యాంపు కార్యాలయంలో బొకేతో వెళ్లారని, ఆయనదే ఐరన్ లెగ్ అన్నారు.
బషీర్ బాగ్ అమరులకు నివాళి
విద్యుత్తు ఉద్యమంలో అసువులు బాసిన వారికి వైయస్ గన్ గురువారం నివాళులు అర్పించారు. బషీర్ బాగ్ కాల్పులకు 14 ఏళ్లు నిండిన సందర్భంగా షహీద్ చౌక్లో అమరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
కాగా, గురువారం ఉదయం శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డ్వాక్రా రుణమాఫీ పై ఇచ్చిన తీర్మానాన్నిస్పీకర్ తిరస్కరించారు. చర్చించాలని ప్రతిపక్షం పట్టుబట్టింది. దీంతో సభ పది నిమిషాలు వాయిదా పడింది. మరోవైపు, మణిగాంధీ, శివప్రసాద్ రెడ్డిల పైన సస్పెన్షన్ ఎత్తివేశారు. సభలో వారు క్షమాపణ చెప్పారు. తాము ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని, తప్పుంటే క్షమించాలని వారు సభలో అన్నారు. దీంతో సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.