అగ్లీ టర్న్: లోకేష్ ఫొటోలంటూ రోజా, ఆమె వీడియోలంటూ సోమిరెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం అదుపు తప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదే స్థాయిలో రోజాపై టిడిపి నాయకులు విరుచుకుపడ్డారు.
నారా లోకేష్ విదేశాల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడని ఆమె కొన్ని ఫొటోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. అంతేకాకుండా ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. కీచకులందరికీ మెంటార్ చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడు లోకేష్ అని ఆమె వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగకుండా లోకేష్ తప్పతాగి అమ్మాయిలతో తిరిగారని ఆమె వ్యాఖ్యానించారు. లోకేష్ మామగారు (నందమూరి బాలకృష్ణ) అమ్మాయిల గురించి దారుణంగా మాట్లాడారని ఆమె అన్నారు. టిడిపి నాయకులు బొండా ఉమ, బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్ మహిళలను వేధించారని ఆమె అన్నారు.
మంత్రి రావెల కీశోర్ కుమార్ కుమారుడు సుశీల్ చిత్తకార్తె కుక్కలా ఓ వివాహితను కారులోకి లాగి అఘాయిత్యం చేయాలని అనుకున్నాడని రోజా వ్యాఖ్యానించారు. సుశీల్పై కేసులో జగన్ కుట్ర ఉందని రావెల కిశోర్ అనడంపై కూడా ఆమె తీవ్రంగానే ప్రతిస్పందించారు.
జగన్ అక్కడ సిసి కెమెరాలు పెట్టారా, లేదంటే బురఖాలో జగన్ వెళ్లారా, లేదంటే చేయి పట్టుకుని లాగాలని సుశీల్కు చెప్పారా అని ఆమె అడిగారు. తాగి అమ్మాయిలతో డ్యాన్సులు వేయాలని లోకేష్కు జగన్ చెప్పారని అన్నా అంటారని ఆమె వ్యాఖ్యానించారు.
అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రోజాపై తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే స్తాయిలో విరుచుకుపడ్డారు. రోజా ప్రవర్తన చూసి మహిళలు సిగ్గుపడుతున్నారని టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. లోకేష్ విదేశాల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఫొటోలను చూపించడంపై కూడా ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
టిడిపి తలుచుకుంటే రోజాకు సంబంధించి వీడియోలను బయటపెడుతుందని ఆయన అన్నారు. రోజాపై రౌడీషీట్ తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. రోజాను ఐదేళ్ల పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. రోజా ఓ బూతుల రాణిలా మారిందని టిడిపి శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు. రోజాకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.