చెప్పుకోవడానికేం లేదు: రోజా, సభలోనే చెప్తాం: జగన్
హైదరాబాద్: అధికార బలంతో గవర్నర్ ప్రసంగాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు రోజా శనివారం ఆరోపించారు. రైతు రుణమాఫీపై కమిటీ వేసి 45 రోజుల పాటు రైతులను అగమ్యగోచర పరిస్థితుల్లోకి నెట్టేశారన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఫించన్లను పెంచుతామని హామీ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం... ఇప్పుడు అక్టోబర్ 12 నుంచి అందిస్తామని చెబుతోందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు.

సభలో స్పందిస్తా: జగన్
ఆంధ్రప్రదేశ్ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నర్సింహన్ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నాయకులు పెదవి విరిచారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమిలేదని ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్ కాంగ్రెైస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం తెలుగుదేశం మెనిఫెస్టోలా ఉందని ఆయన విమర్శించారు. అదే సమయంలో.. గవర్నర్ ప్రసంగంపై సోమవారం సభలోనే తమ అభిప్రాయం చెబుతామని ఆయన అన్నారు.
మరోవైపు గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించిందని వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధాని ఊహాగానాలతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయని, సామాన్యులకు భూములు కొనే స్తోమత లేదని అన్నారు. వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. గవర్నర్ ప్రసంగం తీవ్ర అసంతృప్తి కలిగించిందని మరో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తున్నట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం కరపత్రాన్ని గవర్నర్ చదవి వినిపించారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు భరోసా కల్పించలేదని అన్నారు.












Click it and Unblock the Notifications