కేసీఆర్! అందుకే చంద్రబాబు నెత్తికెక్కాడు, హరికృష్ణ డెడ్బాడీ వద్దే, బాలకృష్ణా అప్పుడు లేవలేదే: రోజా
విజయవాడ: ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అయిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వదిలేసినందువల్ల ఇప్పుడు అతను మీ (కేసీఆర్) నెత్తికి ఎక్కి కూర్చున్నాడని, ఈ విషయం తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గుర్తుకు ఉంచుకోవాలని, ఆయనను తెలంగాణ నుంచి తరిమికొట్టండని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం అన్నారు.
విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ పైన ఉందని, అక్కడ చంద్రబాబు మతితప్పి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించాలని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెబుతున్నారని, ఏపీలో కూడా అదే విషయం చెప్పగలరా అని సవాల్ చేశారు. ఏపీలో ఎమ్మెల్యేలు అమ్ముడుపోతే అభివృద్ధి చూసి అంటావని, తెలంగాణలో నీతిబాహ్యం అవుతుందా అని నిలదీశారు.
చంద్రబాబును చూసి సిగ్గు కూడా సిగ్గుపడుతోంది
చంద్రబాబు వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని రోజా అన్నారు. పొత్తుల కోసం ఆయన వెంపర్లాడుతూ తమపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు వింటే సిగ్గు కూడా సిగ్గుతో చచ్పిపోతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఓడించి చంద్రబాబుకు గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. ఊసరవెల్లిలో రంగులు మార్చే చంద్రబాబుకు అందరు బుద్ధి చెప్పాలన్నారు.
పవన్కు ప్రశ్నించే దమ్ముందా
సభాపతి కోడెల శివప్రసాద రావు రాజ్యాంగబద్ధ పదవికి మచ్చ తెచ్చారని రోజా అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభాపతి కోడెలను ప్రశ్నించే దమ్ము, ధైర్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉందా అని ఆమె ప్రశ్నించారు.
జగన్కు, పవన్కు పోలికనా?
తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిగురించి మాట్లాడే అర్హత జనసేనానికి లేదని రోజా చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలను, తొమ్మిది మంది ఎంపీలను గెలిపించుకున్న తమ అధినేత జగన్కు, అలాగే కనీసం వార్డు మెంబర్ను కూడా గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్కు పోలికనా అని ప్రశ్నించారు.
బాలకృష్ణా! అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేం
రోజా హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణకు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆయనకు అసెంబ్లీకి వచ్చేందుకు, హిందూపురంకు వెళ్లేందుకు సమయం దొరకదు కాని తెలంగాణలో మాత్రం ప్రచారం చేస్తారా అని నిప్పులు చెరిగారు. మీ బావ చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేం అని ప్రశ్నించారు.
హరికృష్ణ మృతదేహం వద్దే అలా చేశాడు
కూకట్పల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న నందమూరి సుహాసినికి ఏమీ తెలియదని, ఆమెను కరివేపాకులా వాడుకుంటున్నారని, ఆమెను బలిపశువుగా చేస్తున్నారని రోజా అన్నారు. హరికృష్ణను మానసికంగా చంపేసి ఇప్పుడు నాటకాలా అన్నారు. వారి కుటుంబంపై ప్రేమ ఉంటే నీ కొడుకు లోకేష్లాగే జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను కూడా ఎమ్మెల్సీలుగా చేసి వారికి మంత్రి పదవులు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు. హరికృష్ణ మృతదేహం వద్దే తెరాసతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేశాడంటే ఆయన దిగజారుడుతనం అర్థమవుతోందన్నారు. నందమూరి కుటుంబం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు.