రోజా లెటర్ బాంబు: టిడిపి చేతికి అస్త్రం, జగన్కు చిక్కులు
స్పీకర్కు రోజాకు రాసిన లేఖ ఇప్పుడు జగన్కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమె రాసిన లేఖను టిడిపి అస్త్రంగా ప్రయోగించాలని ఎత్తుగడలో ఉంది.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శానససభ్యురాలు అనితకు క్షమాపణలు చెబుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు అందజేసిన లేఖ ఇప్పుడు పార్టీలో దుమారం రేపుతోంది. ఒక రకంగా అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు తలనొప్పిగా మారింది.
మీడియాలో వచ్చిన కథనాల మేరకు - ఆ వ్యవహారం కొంత మేర వైసిపిలో అంతర్గత తగాదాలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఆ వ్యవహారం చివరకు జగన్ వద్దకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణలపై రోజా ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు.
ఆ తర్వాత అధికార తెలుగుదేశం పార్టీ సభ్యురాలు అనితను రోజా అసభ్య పదజాలంతో దూషించారంటూ స్పీకర్కు ఫిర్యాదు అందింది. పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న అనిత ఈ ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని సభాహక్కుల కమిటీకి స్పీకర్ అప్పగించారు.
రోజాపై మరో ఏడాది సస్పెన్షన్..
గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలోని సభాహక్కుల కమిటీ అనిత చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపింది. రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయాలని, ఒకవేళ రోజా బేషరతుగా క్షమాపణ చెప్తే రోజాను వదిలేసే విషయంపై అసెంబ్లీనే నిర్ణయం తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఆ కమిటీ నివేదిక ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
సుప్రీంకోర్టు అలా...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియమావళి ప్రకారం రోజా సస్పెన్షన్పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. రోజా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ రోజా స్పీకర్కు ఓ లేఖ రాశారు. తాను అనితను కావాలని దూషించలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలతో ఆమె ఇబ్బంది పడి ఉంటే బేషరతుగా క్షమాపణ చెప్పానని రోజా ఆ లేఖలో రోజా చెప్పారు. ఈ లేఖను రోజా స్పీకర్ కోడెల శివప్రసాద రావును స్వయంగా కలిసి అందచేశారు.
అయితే, రోజా ఇలా చేశారు...
ఆ విధంగా లేఖ ఇచ్చిన రోజా ఆ తర్వాత మాట మార్చి తాను క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని అన్నారు. దాంతో సభా హక్కుల కమిటీ ఆమెపై మరో ఏడాది పాటు సస్పెన్షన్ విధించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. రోజాపై సస్పెన్షన్ విధించే సమయంలో రోజా లేఖను ప్రస్తావించాలని టిడిపి సభ్యులు ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. దాంతో వ్యవహారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విషయంలో తిరగబడే పరిస్థితి కనిపిస్తోంది.
వైయస్ జగన్ గుర్రు..
తనకు తెలియకుండా స్పీకర్కు లేఖ ఎందుకిచ్చారని వైయస్ జగన్ రోజాను ప్రశ్నించినట్లు వినికిడి. పార్టీలోని ముఖ్యమైన నాయకులు ఇవ్వాలని చెప్తేనే తాను ఆ లేఖ ఇచ్చానని రోజా జగన్కు సమాధానమిచ్చారని అంటున్నారు. లేఖ ఇచ్చే సమయంలో స్పీకర్ వద్దకు రోజాతోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా వెళ్లారు. రోజా రమ్మంటేనే తాము వెళ్లామని వారిద్దరూ జగన్కు చెప్పినట్లు తెలుస్ోంది.
అసెంబ్లీకి కమిటీ నివేదిక..
సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభాహక్కుల కమిటీ రోజా వ్యవహారంపై రూపొందించిన నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ఈ స్థితిలో రోజా వివాదం తెరపైకి రానుంది. క్షమాపణ చెప్పేది లేదంటూ రోజానే కాకుండా జగన్ కూడా అంటున్నారు. క్షమాపణ చెప్పకపోతే మళ్లీ సస్పెన్షన్ తప్పదని తెలుగుదేశం పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి.
టిడిపి దొరికిన లేఖాస్త్రం....
స్పీకర్ కోడెలకు రోజా రాసిన లేఖను టిడిపి సభ్యులు అస్త్రంగా ప్రయోగించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అనితకు తాను బేషరతుగా క్షమాపణ చెబుతానని స్పీకర్కు లిఖితపూర్వకంగా రోజా లేఖ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మాట తప్పితే ఎలా అని టిడిపి సభ్యులు ప్రశ్నించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో రోజానే కాకుండా జగన్ కూడా చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.