నీ తిండికి రూ.30 కోట్లా? దారుణం.. ఎన్టీఆర్ డూప్ డైలాగ్.. బాబు నవ్వులు: రోజా ఆగ్రహం
Recommended Video
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబుది దీక్ష కాదని, ఉపవాసం అని ఎద్దేవా చేశారు. 12 గంటల పాటు తినకుండా ఉంటే ఉపవాసం అంటారన్నారు.
నేను పుల్కాలు తింటాను, కూరగాయలు తింటాను అని చంద్రబాబు పలుమార్లు మీడియాతో చెప్పారని, అలా తింటే రోజుకు వందల రూపాయలు కావాలని, ఇప్పుడు దీక్ష పేరుతో ఈ రోజు మీ తిండికి రూ.30 కోట్ల ప్రజా సొమ్మును డ్రా చేసుకుంటారా అని ప్రశ్నించారు. మీ దీక్షకు ప్రజల సొమ్మును ఖర్చు పెడితే ఏమనాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమం అంటూ వేదికపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
ఆమరణ దీక్ష అంటే ఏమిటంటే?
చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ దొంగ దీక్ష చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పినప్పుడే చంద్రబాబు ఢిల్లీ దీక్ష చేస్తే ఫలితం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు చేస్తే ఏం లాభం అన్నారు. ఆమరణ నిరాహార దీక్ష అంటే తిండి తినకుండా ప్రజల కోసం చావుకైనా సిద్ధపడటమన్నారు. చంద్రబాబు చేసే దీక్ష కేవలం ఉపవాసం మాత్రమేనని, అలాంటి మీరు దీనిని దీక్ష అంటే ఎలా అన్నారు.
ఎన్టీఆర్ డూప్లతో డైలాగ్లా.. బాబు నవ్వులు
ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి, దానిపై ఏమాత్రం అవగాహన లేని వారిని, క్రీడాకారులను పిలిపించి పొగిడించుకుంటున్నారని రోజా మండిపడ్డారు. హోదా కోసం దీక్ష అని చెప్పి డ్యాన్సులు, ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ వేషధారణలో డ్యాన్సులు చేస్తూ ఆయన ఆత్మక్షోభించేలా చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ డూపులతో ఇష్టం వచ్చిన డైలాగ్లు చెప్పించుకొని చంద్రబాబు నవ్వుతున్నారని, ఇది సరికాదన్నారు.
పదవులు లాక్కొని దండం పెడతారా?
వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకోగానే తన పని అయిపోయిందని గుర్తించిన చంద్రబాబు తన సత్తా నిరూపించుకోవడానికి ఇలా దీక్ష ప్రారంభించారన్నారు. ఎన్టీఆర్ నుంచి పదవి, కుర్చీ.. అన్నీ లాక్కొని ఇప్పుడు ఆయనకు చంద్రబాబు దండం పెడుతున్నారని, ఇప్పుడు అలాగే ప్రత్యేక హోదా కోసం నదులు, నిధులను ఓటుకు నోటు కోసం కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని, ఇప్పుడు హోదా అంటూ దీక్ష చేస్తుంటే ఎలా నమ్మాలన్నారు.
దొంగ దీక్షకు కాలేజీ పిల్లలు ఎందుకు?
దీక్షల వల్ల ఏం వస్తుందని, ర్యాలీల వల్ల ఏం వస్తుందని చంద్రబాబు గతంలో చెప్పారని, కానీ ఇప్పుడు ఆయనే ఎందుకు చేస్తున్నారని రోజా ప్రశ్నించారు. నిరసనలు ఇక్కడ ఎందుకు అని చంద్రబాబు అడిగారని, ఇప్పుడు ఆయన ఢిల్లీలో కాకుండా ఇక్కడ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాలేజీ పిల్లలను, స్కూలు పిల్లలను నీ దొంగ దీక్షకు ఎందుకు ఉపయోగించుకుంటున్నావని చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్రబాబుకు ట్రీట్మెంట్ అవసరం
చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ఆయనకు ట్రీట్మెంట్ అవసరమని, హోదాను చంపేసిన చంద్రబాబు ఇప్పుడు దాని కోసమే నిరాహార దీక్ష చేయడం విడ్డూరమని రోజా అన్నారు. రేపు చంద్రబాబు తాను ఇచ్చిన హామీలే అమలు కాలేదని దీక్ష చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేకుంటే వ్యవస్థ గాడితప్పుతుందని, అందుకే వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబుది ఎంటర్టైన్మెంట్ దీక్ష
ప్రజల సమస్య తెలుసుకునేందుకు జగన్ రోజు పాదయాత్ర చేస్తున్నారని, కానీ చంద్రబాబు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారని, ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం దీక్ష చేస్తున్నారని, అలాంటి దీక్షను మీడియా బాగా చూపిస్తోందని, కానీ తమ ఎంపీలు ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేస్తే ఏ మీడియా చూపించలేదని మండిపడ్డారు. చంద్రబాబు చేసేది ధర్మ దీక్ష కాదని, ఉపావాస దీక్ష అన్నారు.