జగన్కు షాక్: ఏడాది పాటు అసెంబ్లీ నుంచి రోజా సస్పెండ్, ఎందుకు?
హైదరాబాద్: విజయవాడలో ప్రకంపనలు సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారం శుక్రవారం నాడు అసెంబ్లీలో వేడిని రాజేసింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం వాదులాడుకున్నాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
జగన్ ఆవేశంగా మాట్లాడుతూ... మేం చెప్పేది రెండు నిమిషాలు వినాలన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్న వారికి రూల్స్ ఏమిటో తెలియవన్నారు. ప్రకటన చేశాక చర్చ జరుగుతుందా.. ఎవరైనా నవ్వుతారు అని జగన్ వ్యాఖ్యానించారు. చర్చ అంటే.. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ప్రకటన చేయడం అన్నారు.
జగన్ ఆవేశంగా మాట్లాడుతుండగా... చంద్రబాబు ఇతర సభ్యులతో కలిసి నవ్వుకున్నారు.జగన్ ఇంకా మాట్లాడుతూ.. ఇక్కడ డిక్టెటర్ పాలన సాగుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఇది అందరికీ అర్థమవుతోందన్నారు. మాకు ప్రకటన ఇవ్వలేదని చెప్పారు. చర్చ సమయంలో ప్రకటనకు లింక్ చేస్తూ ఆంక్షలు పెట్టవద్దన్నారు.
దీనిపై స్పీకర్ మాట్లాడుతూ.. అందరికీ ప్రకటన ఇచ్చినప్పుడు, మీ వద్ద ఎందుకు లేదో నాకు తెలియదన్నారు. ఇరు పక్షాలు అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగించారని, వాటిని తొలగిస్తామన్నారు. హౌస్ అంటే అందరు కలిస్తేనే నడుస్తుందన్నారు. లీడర్ ఆఫ్ హౌస్ (ముఖ్యమంత్రి) మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడవచ్చన్నారు.
యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... జగన్కు అసలు ఇవి ఎవరు నేర్పారు, వారిని అనాలన్నారు.
దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... జగన్ అసలు చర్చకు సిద్ధంగా ఉన్నారా లేదా తెలియాలన్నారు. జగన్ చర్చకు ఎందుకు భయపడుతున్నారన్నారు. సభా సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారో చెప్పాలన్నారు. మీరు అడిగే ప్రతిదానికి మేం సమాధానం ఇస్తామని చెప్పాక అడ్డుకోవడం ఎందుకన్నారు.
మేం ప్రతిపక్షంలో పదేళ్లు ఉన్నామని ఆ సమయంలో మేం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లలేదన్నారు. సమస్య ఉంటే స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. రోజా అసభ్యపదజాలం ఉపయోగించారు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రోజాను ఈ సభ నుంచి సస్పెండ్ చేయాలని నరేంద్ర డిమాండ్ చేశారు.
మంత్రి యనమల మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యులు కాల్ మనీ అంశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సభలో ఇలాంటి మాటలు సరికాదన్నారు. కాల్ మనీ రాకెట్ బాబు, సెక్స్ రాకెట్ బాబు వంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రిపై చేయడం సరికాదన్నారు.
అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు వారిని సస్పెండ్ చేయాలన్నారు. సీఎంను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రోజాను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. యనమల ప్రతిపాదించగా.. స్పీకర్ కోడెల శివప్రసాద రావు.. రోజాను సస్పెండ్ చేశారు.
రోజాను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన తర్వాత.. స్పీకర్ కోడెల శివప్రసాద రావు.. రోజాను సభ నుంచి వెళ్లిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
జగన్ అవినీతి సామ్రాట్: పల్లె
మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ... సభలో వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. తాము పట్టిన తాబేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వారు వ్యవహరిస్తున్నారన్నారు.ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు.
చంద్రబాబు పదేళ్ల పాటు సీఎంగా పని చేశారని, ప్రతిపక్ష నేతగా పని చేశారన్నారు. చంద్రబాబు పైన ఎలాంటి మచ్చ లేదన్నారు. ఎన్ని కేసులు వేసినా ఆయన మచ్చ లేకుండా బయటకు వచ్చాడన్నారు. ఆయన నీతిమంతుడన్నారు.
లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిన, ఈ రాష్ట్రంలో ఎవరు చేయని నేరాలు చేసిన జగన్కు కాల్ మనీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలియని వారికి చెప్పవచ్చునని, తెలిసిన వారికి చెప్పవచ్చునని, కానీ జగన్ లాంటి తెలిసీ తెలియని వారికి చెప్పలేమన్నారు. జగన్ అవినీతి సామ్రాట్ అన్నారు. ఈ రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా జగన్కు సంబంధం ఉంటుందన్నారు.