రోజాను అడ్డుకోవడమే లక్ష్యమా?: రంగంలోకి అనిత, రోజాపై కోర్టు కీలక వ్యాఖ్య
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విషయంలో మరో కొత్త ట్విస్ట్. రోజా తనను దూషించారని టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనిత అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ ఈ నెల 21వ తేదీన సమావేశం కానుంది.
తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై రోజా కోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. హైకోర్టులో ఆమెకు అనుకూలంగా గురువారం ఉదయం తీర్పు వచ్చింది. రోజా తీరును తప్పుబట్టిన కోర్టు, ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. ఒక సెషన్కు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కాపీని తీసుకొని అసెంబ్లీకి రావాలని రోజా భావించారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు వైసిపి సభ్యులు నిరీక్షించారు. అదే సమయంలో రోజాను అడ్డుకునేందుకు ప్రభుత్వం మార్షల్స్ను రంగంలోకి దించింది. ఆ తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అనిత ఫిర్యాదు, ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుండటం మరో కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు.
రోజా ప్రవర్తను సమర్థించడం లేదు: హైకోర్టు
వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పైన విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీలో రోజా ప్రవర్తనను సమర్థించడం లేదని పేర్కొంది. సెక్షన్ 340(2) ప్రకారం రోజాను ఒక సెషన్కు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని తెలిపింది. సస్పెన్షన్ పైన ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటికీ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
రోజా సస్పెన్షన్, యనమల ప్రతిపాదన ఇలా..
మరోవైపు, రోజా సస్పెన్షన్ విషయంలో వైసిపి సభ్యులు మంత్రి యనమల రామకృష్ణను తప్పుబడుతున్నారు. ఆయన వల్లనే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన రోజు యనమల తీర్మానం ప్రతిపాదించారు.
ఆయన మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ఇది మైకులో ఉంది. రికార్డులో ఉంది. పబ్లిక్ దీని గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. హౌస్ మంచి లాంగ్వేజ్ మాట్లాడేందుకు ఉంది. కాల్ చంద్రబాబు, మైన్ చంద్రబాబు, మైన్ చంద్రబాబు అన్నారు. ఇది సిగ్గుచేటు. కాబట్టి రోజాను సస్పెండ్ చేయాలని సభ కోరుతుంది' అని యనమల రామకృష్ణుడు నాడు రోజా పైన సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టారు.