జగన్ చాంబర్లో చల్లదనం కోసమే, మేమే పగులగొడతాం: బాబును ఏకేసిన రోజా, నంద్యాలపై బాధ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు మద్యం షాపులను తీసేస్తే చంద్రబాబు మళ్లీ తీసుకు వచ్చారని మండిపడ్డారు. బెల్టు షాపులకు చంద్రబాబును ఫాదర్ ఆఫ్ బెల్ట్ షాప్గా చెప్పుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మద్యాన్ని నియంత్రిస్తానని, ఇళ్ల మధ్యన ఉన్న బెల్టు షాపులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఈ హామీపై చంద్రబాబు మూడేళ్ల క్రితమే సంతకం చేశారన్నారు.
ఐదు సంతకాల్లో నాలుగు హుష్ కాకీ
చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాల్లో నాలుగు సంతకాలకు దిక్కు దివానం లేకుండా పోయిందన్నారు. సిఎం సంతకాలకు విలువ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. దీనిని బట్టే ఆయన అసమర్థుడని తేలిపోతుందన్నారు.
Recommended Video
టార్గెట్లు పెట్టి లిక్కర్ అమ్మకం
టార్గెట్లు పెట్టి లిక్కర్ అమ్మిస్తారని రోజా మండిపడ్డారు. మహిళలు నిలదీసేసరికే మాట తిరగేస్తారన్నారు. తద్వారా తన ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు అంగీకరించారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ పేరు చెప్పి.. మోసం.. జగన్ వల్లే
ఎన్టీఆర్ పేరు చెప్పి భోజనం పెడతానని, నీరు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఏం చేశారని రోజా నిలదీశారు. ఏ హామీ నెరవేరలేదన్నారు. జగన్ తొమ్మిది పథకాలు ప్రకటించగానే చంద్రబాబు నవనాడులు కదిలిపోయాయన్నారు. జగన్ వల్లే హడావిడి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
బాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే
కోటయ్య కమిటీ కోతల కమిటీగా మారిందని రోజా అన్నారు. మద్యం నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచాడన్నారు. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి, ఆ బాధ తెలియదన్నారు. సుప్రీం కోర్టు తీర్పును ఎందుకు అమలుపరచడం లేదన్నారు.
నాశనం చేస్తాం.. మేమే పగులగొడతాం
మహిళల కన్నీళ్లు ప్రభుత్వానికి పట్టడం లేదని రోజా మండిపడ్డారు. అక్రమ బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే మేమంతా (మహిళలం) కలిసి వాటిని నాశనం చేస్తామన్నారు. పది రోజులు సమయం చూస్తామని, ఆ తర్వాత మేమే పగులగొడతామని చెప్పారు.
జగన్ వల్లే చలనం.. రాజధాని ఇలా
మద్యం విషయంలో చంద్రబాబు ప్రభుత్వంలో కొంతైనా చలనం వచ్చిందంటే అది జగన్ వల్లేనని రోజా అన్నారు. అక్రమ బెల్టు దుకాణాలపై చర్యలకు టైం ఇచ్చారని, కానీ అలాంటి వాటికి టైం కూడా అవసరం లేదన్నారు. ఎవరు అడిగారని చంద్రబాబు బార్లు, రెస్టారెంట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రపంచస్థాయి రాజధాని అని చంద్రబాబు చెప్పారని, కానీ చిన్నపాటి వర్షానికే సచివాలయంలో వర్షం కురుస్తోందని చెప్పారు. వాటర్ లీకేజీపై జగన్ చాంబర్లో చల్లదనం కోసమే లీకేజీ చేశామని చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. చిన్న వర్షానికే ఇంతటి కష్టాలు వస్తున్నాయన్నారు.
స్పీకర్కు తెలియకముందే నోటీసులు ఇచ్చారని చెప్పారు
తనకు నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ఓ పత్రిక పేర్కొందని, అంటే ఆ పత్రికకు తనపై ఎంత కోపం ఉందో తెలుస్తోందన్నారు. అడ్డదారిలో వచ్చిన లోకేష్కు పదవి వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
లోకేష్కు ఉద్యోగం
తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పారని, కానీ అవి నెరవేరలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని లోకేష్ చెప్పారని, కానీ ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. అడ్డదారిలో మంత్రి అయిన లోకేష్కు ఓపిక లేకుండా పోతోందని, మాట్లాడితే కసురుకుంటున్నారని, ఒరేయ్ అంటున్నారని రోజా అన్నారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు పీజీ చేస్తే, లోకేష్ ఏకంగా పిహెచ్డి చేశారన్నారు.
నంద్యాలపై బాధపడ్డ రోజా
నంద్యాల విషయం చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తోందని రోజా అన్నారు. నంద్యాలలో ఈ మూడేళ్లలో చంద్రబాబు రూ.30 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని, కానీ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూ.300 కోట్ల అభివృద్ధి పనులు అంటున్నారన్నారు. సమస్యలపై పోరాడుతున్న జగన్ వెనుకే ప్రజలు ఉన్నారన్నారు. వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు.
వారి పార్టీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డియే స్వయంగా సంచలన వ్యాఖ్యలు చేశారన్నారు. భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల బాగా అభివృద్ధి చెందుతుందని, దీనిని చూస్తుంటే ఇతర నియోజకవర్గాల ప్రజలు కూడా తమ ఎమ్మెల్యే చనిపోతే బాగుండుననుకుంటున్నారని స్వయంగా టిడిపి ఎమ్మెల్యే అన్నారని రోజా మండిపడ్డారు.