ఓటుకు నోటు సహా.. జిత్తులమారి నక్క, ఎవరో బీజేపీ నేత మాట్లాడితే: బాబు-లోకేష్లను దులిపిన రోజా
విశాఖపట్నం: ప్రత్యేక హోదాపై తెలుగు ప్రజలను వంచించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో వంచన వ్యతిరేక దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు.
వైసీపీ, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే చంద్రబాబు ఉక్కుపాదంతో అణిచివేసి ఇప్పుడు హోదా కోసం దీక్ష చేస్తున్నానని చెబితే ప్రజలు నమ్మేందుకు పిచ్చివాళ్లు కాదన్నారు. ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని అందరికీ తెలుసునని, కానీ చంద్రబాబు మాత్రం ఏప్రిల్ 30న కూడా ప్రజలను ఫూల్స్ చేయాలని చూస్తున్నారన్నారు.
చంద్రబాబు జిత్తులమారి నక్క అని తేలింది
చంద్రబాబు జిత్తులమారి నక్క అని ఈ నాలుగేళ్లలో ప్రజలు తెలుసుకున్నారని, అందుకే ఫూల్స్ చేయాలనుకున్న టీడీపీనే ప్రజలు ఫూల్స్ చేసేందుకు నిర్ణయించుకున్నారని రోజా చెప్పారు. ఈ నాలుగేళ్లలో బాహుబలి గ్రాఫిక్స్లా రాజధాని గ్రాఫిక్స్తో మభ్యపెట్టారని రోజా మండిపడ్డారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అన్నారు. మీకు చేతనైతే నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో అంటకాగిన మీరు పోలవరం పూర్తి చేసేవారు, రాజధాని పనులు ప్రారంభించేవారన్నారు.
అమరావతిని మేం ఆపుతున్నామా?
అమరావతిని మేము ఆపుతున్నామా? రాజధానిని మేం ఆపుతున్నామా? అని రోజా మండిపడ్డారు. జగన్పై యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు అవాస్తవాలు అన్నారు. ఆర్థికమంత్రిగా ఉండి ఆయన జీఎస్టీ మినహాయింపులు ఎందుకు తీసుకు రాలేదన్నారు. దేవినేని ఉమ నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. మీరు ద్రోహం చేసి, మీరు మోసం చేసి జగన్ను అంటారా అని నిలదీశారు.
ద్రోహం చేసింది చంద్రబాబు, జగన్ మగాడు
అయిదు కోట్ల మంది ఆంధ్రులకు ద్రోహం చేసింది చంద్రబాబు అని రోజా మండిపడ్డారు. అన్ని తప్పులు, పాపాలు మీరు చేసి వైసీపీని అంటారా అని మండిపడ్డారు. మీ పాపాలు, తప్పులు చివరకు వచ్చాయన్నారు. మీరు ప్రజలను వంచించి, మీరు కుట్ర రాజకీయాలు చేసి, మీరు రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు నమ్మకద్రోహం చేస్తే మేం చూస్తూ కూర్చోవాలా అన్నారు. మీ కుట్రలను, మీ ద్రోహాలను, బీజేపీ చేసిన మోసాన్ని చెప్పేందుకే మేం వంచన వ్యతిరేక దీక్ష చేస్తున్నామన్నారు. పోరాటాలకు వైసీపీ పుట్టినిల్లు అన్నారు. నాడు సోనియాపై, నేడు మోడీపై రాష్ట్ర ప్రజల కోసం ఢీకొన్న మగాడు జగన్ అని రోజా అన్నారు.
దొంగ దీక్ష చేస్తావా
టీడీపీకి 18 మంది ఎంపీలు ఉన్నారని, కానీ చంద్రబాబు ఏపీ కోసం ఏం చేయలేకపోయారని, కానీ మాకు 5గురు ఎంపీలే ఉన్నప్పటికీ వారితో రాజీనామా చేయించి, దేశవ్యాప్తంగా హోదా చర్చకు రావడానికి కారణమైన వ్యక్తి జగన్ అని రోజా అన్నారు. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీ అంటూ మీరు చేసిన తీర్మానం ప్రజలు మరిచిపోలేదన్నారు. ప్యాకేజీ.. హోదా గురించి మీరు ఎన్నో యూటర్న్లు తీసుకున్నారన్నారు. ఎంపీలందరూ రాజీనామా చేస్తే హోదా వస్తుందని అందరికీ తెలుసునని, కానీ క్రెడిట్ జగన్కు వస్తుందని మీ ఎంపీలతో రాజీనామా చేయకుండా దొంగ దీక్ష చేస్తున్నారన్నారు.
మాటేమిటి ఎవరో బీజేపీ నేత మాట్లాడితే మమ్మల్ని అంటావా?
ఎవరో బీజేపీ నాయకుడు మాట్లాడితే మేం లాలూచీ పడ్డామని మాట్లాడుతారా అని రోజా మండిపడ్డారు. మరి బీజేపీ మంత్రిని టీటీడీ బోర్డు మెంబర్గా చేసిన చంద్రబాబు ఏ లాలూచీ పడ్డారో చెప్పాలని ప్రశ్నించారు. అరుణ్ జైట్లీతో రహస్యంగా సుజనా చర్చలు జరిపారని, దాని వెనుక ఏం రాజకీయం ఉందో చెప్పాలని ప్రశ్నించారు. విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ రకమైన బుద్ధి చెప్పారో, టిడిపి-బీజేపీలకు ప్రజలు ఇప్పుడు అదే బుద్ది చెబుతారన్నారు. సంక్రాంతి సమయంలో బుడబుక్కల వాళ్లు వస్తారని, ఇప్పుడు చంద్రబాబు అలాగే వస్తున్నారన్నారు.
రాయలసీమ పులిబిడ్డను సీఎం చేయండి
2014లో చంద్రబాబుకు ఓటు వేసి నష్టపోయామని, 2019లోను ఆయనకు ఓటు వేసి నష్టపోవద్దని రోజా పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉండే చంద్రబాబు ఏం చేయలేకపోయారని, ఇక ఇప్పుడేం చేస్తారని అడిగారు. అలాంటి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్యాకేజీ ఇచ్చినందుకు ఢిల్లీకి వెళ్లి మరీ సన్మానాలు చేసిన చంద్రబాబును ఇంటికి పంపించాలన్నారు. జగన్సు సీఎం చేయాలన్నారు. పోలవరం, అమరావతి పూర్తవ్వాలన్నా, హోదా రావాలన్నా.. రాయలసీమ పులిబిడ్డ జగన్తోనే సాధ్యమని రోజా అన్నారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఏపీని మోసం చేసిన బీజేపీ, టీడీపీకి బుద్ధి చెప్పాలన్నారు. చివరలో ఆమె ప్రాణాలైనా అర్పిస్తాం.. హోదా తీసుకు వద్దామని నినాదాలు చేశారు.
బాబు, లోకేష్ తప్పులు చేసి బీజేపీకి భయపడుతున్నారు
అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని రోజా అన్నారు. చంద్రబాబు, లోకేష్ సహా తప్పులు చేసి బీజేపీకి భయపడుతున్న దద్దమ్మలు అన్నారు. జగన్ ఏ తప్పు చేయలేదు కాబట్టి కోర్టుకు హాజరవుతున్నారని చెప్పారు. ఓటుకు నోటు కేసు సహా ఎన్నో కేసుల్లో దొరికిపోయారని, అవినీతికి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు.