ప్రత్యేక హోదా అలజడి: బాబు, వెంకయ్యలకు చిక్కులు, టిడీపి కూడా..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వపోవచ్చుననే వార్తలు వెలువడిన నేపథ్యంలో రాజకీయ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడిని ప్రతిపక్షాల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. టిడిపి నాయకులు కూడా బిజెపి తీరును తప్పు పడుతున్నారు. బుచ్చయ్య చౌదరి వంటి టిడీపి నేతలు కూడా విమర్శలకు దిగడం చంద్రబాబుకే కాకుండా వెంకయ్య నాయుడికి కూడా చిక్కులు తెచ్చి పెడుతోంది.
బిచ్చమెత్తడం లేదు: బుచ్చయ్య చౌదరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము బిచ్చమెత్తుకోవడం లేదని టిడిపి శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పిన నేడు ఓ దుర్దినమని ఆయన వ్యాఖ్యానించారు. ఎపి హక్కుల కోసం తాము పోరాటం చేస్తామని చెప్పారు.
ఎపికి ప్రత్యేక హోదా తమ హక్కు అని, తామేమీ యాచించడం లేదని ఆయన అన్నారు. హామీలను నెరవేర్చలేనప్పుడు రాష్ట్ర విభజనకు బిజెపి ఎందుకు మద్దతు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.
షాక్ కొట్టినట్లుంది: బొండా
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదంటూ కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంతో రాష్ట్ర ప్రజలకు షాక్ కొట్టినట్లు ఉందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు.
నేతలంతా ఏకం కావాలి: ద్రోణం రాజు
ప్రత్యేకహోదా కోసం నేతలంతా ఏకం కావాలని కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా తోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కేంద్రం దిష్టిబొమ్మ దగ్ధం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిజస్వరూపం దాంతో బయటపడిందని, కనుక చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రంతో అమితుమీ తేల్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.
వెంకయ్య రాజీనామా చేయాలి: రామకృష్ణ
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరుగుతుందంటూ ఢిల్లీ వెళ్లి చంద్రబాబు దీక్షలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇప్పుడు మౌనం వీడాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఎన్డీఎ నుంచి చంద్రబాబు వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై మాట తప్పినందుకు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వెంకయ్య నాయుడు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకుని వెళ్లాలని ఆయన కోరారు.
బిజెపి ద్వంద్వ వైఖరి: మధు
ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ ద్వంద్వ వైఖరి బయట పడిందని సీపీఎం నేత మధు ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని, సాంకేతిక కారణాలను కేంద్రం సాకుగా చూపుతోందని ఆయన ఆరోపించారు.అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉన్నా, బీజేపీ టీడీపీలు పచ్చి అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ వైఖరిని టీడీపీ ఎందుకు ఖండించదని మధు ప్రశ్నించారు. టీడీపీ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవ్వబోమని చెప్పలేదు: పరకాల
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా ప్రతినిధి పరకాల ప్రభాకర్ అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని సభలోనే హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేసే బాధ్యత కేంద్రానిదేనని ఆయన మీడియాతో అన్నారు. హామీలు నెరవేర్చాలని ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర మంత్రి ఇచ్చిన జవాబులో ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే అంశం లేదని ఆయన అన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేస్తుందనే విశ్వాసం తమకు ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలను అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. వాటిని సాధించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఆర్థిక లోటును తీర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు.
కాంగ్రెసును నిందించిన రాయపాటి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రక్రియ సరిగా చేయకపోవడం వల్లే ప్రత్యేక హోదా దక్కలేదని నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. రాష్ట్రాన్ని కేంద్రం ఆర్థికంగా ఆదుకుంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.
బిజెపి నమ్మకద్రోహం: వసంత
ప్రత్యేకహోదాపై బీజేపీ నమ్మకద్రోహం చేసిందని జై ఆంధ్రా ఉద్యమనేత వసంత నాగేశ్వరరావు ఆరోపించారు. , ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి సాధించేందుకు పార్టీలకతీతంగా పోరాటం జరుపుతామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలందరూ ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
చంద్రబాబు సమీక్ష
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ ప్రకటనపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష జరిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారుసు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాలను వ్యతిరేకించిందని మాత్రమే కేంద్రమంత్రి చెప్పారు. కేంద్రం 14 ఆర్థిక సంఘం సిఫారుసును అమలు చేస్తుందా? లేదా ? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు.