స్నానం కూడా చేయకుండా పరుగులు తీశా: చంద్రబాబు
విజయవాడ: రాష్ట్ర రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారని, ఈ సమయంలో ప్రశాంత వాతావరణం కన్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు విజయవాడ అంటే భయపడే పరిస్థితి ఉండేదని అన్నారు. లూటీలు, రౌడీయిజాన్ని, అరాచకాలను అణచివేయగలనని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రం 16 నెలల పసికందు, దీనిని సాకటంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇంకా నడిచే పరిస్థితి రాలేదని, కోలుకునే సమయంలో దెబ్బకొట్టొద్దని చంద్రబాబు అన్నారు. సింగపూర్లో పెట్టుబడిదారులు, ఇతరులతో చర్చించేందుకు గాను రాత్రి పగలు విశ్రాంతి లేకుండా గడిపానని, కనీసం స్నానం కూడా చేయకుండా పరుగులు తీయాల్సి వచ్చిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ గర్వపడేలా ప్రపంచంలోనే అద్భుతంగా నిలిచేలా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. విజయదశమి రోజున జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి భారతదేశం, సింగపూర్ ప్రధాన మంత్రులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరిలో ఈ రాజధాని నాది అన్న భావన కలిగేలా అందర్నీ భాగస్వామ్యం చేస్తానని చెప్పారు.

శుక్రవారం నాడిక్కడ క్యాంప్ కార్యాలయంలో అధ్యక్షుని హోదాలో సిఆర్డిఏ సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబునాయుడు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఒక్క రాజధాని నిర్మాణంపైనే ప్రభుత్వం దృష్టి పెడుతుందనే భావన వద్దని, 13 జిల్లాల్లో సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టగలనన్నారు. రాజధాని నిర్మాణానికి అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు వైసిపి, కాంగ్రెస్ పార్టీలు ఏ మాత్రం సహకరించటం లేదన్నారు.
అమరావతిలో రాజధాని చేపడుతున్నామని ప్రకటించిన మరుక్షణమే వివిధ ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టారని ఆ తరువాత భూ సమీకరణకు చర్యలు చేపట్టిన మరుక్షణమే రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అయినప్పటికీ రైతులు ఎంతగానో విశ్వాసంతో 33,500 ఎకరాల భూములను అప్పగించటం జరిగిందన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ తుచ తప్ప కేంద్రంచే అమలు చేయిస్తున్నానంటూ కేవలం ప్రత్యేక హోదా వలన ఒరిగేది శూన్యమని అదనపు ప్రయోజనాలను కూడా రాబట్టేందుకే తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు. రాజకీయ మనుగడ కోసం ప్రత్యేక హోదాను రాజకీయం చేస్తున్నారన్నారు.
సీడ్ క్యాపిటల్కు సింగపూర్ దేశం ఉచితంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించి అందించటం జరిగిందన్నారు. నిర్మాణంలో సింగపూర్ ఏజెన్సీలతో పాటు జపాన్ దేశం నుంచి వచ్చే ఆఫర్లను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటుచేసి నిర్మాణంలో భాగస్వామిగా నిలిచి భూముల్లో పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపార సంస్థల నిర్మాణాలను చేపట్టి లాభాలు గడించేలా ఈ సంస్థ కృషి చేయగలదన్నారు. 30 కిలోమీటర్ల నదీ తీరంలో జరిగే రాజధాని నిర్మాణం పూర్తిగా బ్లూ, గ్రీన్ సిటీగా వర్థిల్లగలదన్నారు.
కృష్ణానదిపై మూడు వంతెనల నిర్మాణం జరుగుతుందన్నారు. అయితే ఎక్కడెక్కడ అనేది చెప్పలేదు. నిర్ణీత సమయంలోనే రాజధాని నిర్మాణం పూర్తికాగలదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జపాన్లో 30 రోజుల్లో 60 అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని, వారం రోజుల్లో షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయంటూ అలాంటి బెస్ట్ టెక్నాలజీని రాజధాని నిర్మాణానికి వినియోగించుకోబోతున్నామని చెప్పారు.
రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని అన్నారు. స్వాతంత్య్రానంతరం డెహ్రాడూన్, జార్ఖండ్, రాయపూర్, చండీఘర్లలో ఏర్పాటైన రాజధానుల్లో నేటికీ సిటీ లైఫ్ లేదని, సాయంత్రానికి జన సంచారమే ఉండని పరిస్థితి ఉందన్నారు. అయితే అమరావతి రాజధాని పూర్తిగా సిటీ లైఫ్తో ముడిపడి ఉంటుందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ సంస్కృతి అద్దంపట్టేలా రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications