ఆర్ఆర్ఆర్ కు జగన్ ప్రభుత్వం భారీ రిలీఫ్ - సినిమా ఖర్చు అఫీషియల్ గా : మెగాస్టార్ ఎఫెక్ట్..!!
పాన్ ఇండియా సినిమాకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా విడుదల అయిన రోజు నుంచి పది రోజుల పాటుగ సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకొనేందుకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు ధరలు పెంచుకొనే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్వయంగా వెల్లడించారు. గతంలో చిరంజీవి అండ్ టీం సీఎం జగన్ తో చర్చలు చేసిన సమయంలో రెమ్యునరనేషన్ తో సంబంధం లేకుండా వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు ప్రభుత్వం అదనపు ధరలకు అనుమతి ఇస్తుందని స్పష్టం చేసారు.
ఆర్ఆర్ఆర్ ఖర్చు వివరాలతో
ఆ తరువాత విడుదల చేసిన జీవోలనూ అదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక, కొద్ది రోజుల క్రితం విడుదలైన రాధేశ్యామ్ మూవీకి సైతం ప్రభుత్వం టికెట్ ధర రూ 25 చొప్పున పెంచుకొనే వెసులుబాటు కలిగించింది. తాజాగా.. ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకుడు రాజమౌళి.. నిర్మాత దానయ్యతో పాటుగా సీఎం జగన్ ను కలిసారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా సినిమా బడ్జెట్ వంద కోట్లు దాటిందంటూ లెక్కలు వివరించారు. అధికారికంగా ప్రభుత్వానికి సైతం సమాచారం ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం మొత్తంగా రూ 336 కోట్లు ఖర్చు చేసినట్లుగా నిర్మాతలు ప్రభుత్వానికి లెక్కలు సమర్పించారు. దీంతో...ఆర్ఆర్ఆర్ ఈ నెల 25వ తేదీన విడుదల నుంచి పది రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మూవీ మేకర్స్ కు భారీ రిలీఫ్
దీనికి ముందు ప్రభుత్వం జారీ చేసిన జీవోతో హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి సైతం దీని పైన నేరుగా పేర్ని నానితో చర్చించినట్లుగా సమాచారం. ఆ తరువాతనే దర్శకుడు రాజమౌళి..నిర్మాతతో కలిసి సీఎం ను కలిసి అధికారికంగా వినతి పత్రం సమర్పించారు. ఆ సమావేశం తరువాత కూడా రాజమౌళి...సీఎం బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావటంతో పన్నుల విషయంలోనూ ఆలోచన చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీని పైన మాత్రం ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పందన రాలేదు. చిరంజీవి టీంతో చర్చల సమయంలో సినిమా బడ్జెట్.. టికెట్ ధరల పెంపు పైన నిర్ణయం జరిగింది.
Recommended Video
పది రోజుల పాటు ధరల పెంపుకు అనుమతి
కానీ, ప్రభుత్వం అప్పటికే నియమించిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత అధికారికంగా జీవో జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఆలోగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో నిర్ణయం ఆలస్యం అయింది. దీంతో..భీమ్లానాయక్ సినిమా విడుదల సమయానికి జీవో విడుదల కాలేదు. అది రాజకీయంగా వివాదంగా మారింది. ఇక, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్..అదే విధంగా చిరంజీవి తనయుడు రాం చరణ్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ సినిమాకు రాజమౌళి దర్శకుడుగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం సైతం భారీగా ఖర్చు చేసారు. ఈ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వటంతో మూవీ మేకర్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.